బాగాలేని చీరను రిటర్న్ తీసుకోని ఓ బట్టల షాప్నకు షాక్ తగిలింది. వినియోగదారుడికి చీరతోపాటు నష్టపరిహారం కూడా చెల్లించాలని వినియోగదారుల ఫోరం సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకెళితే, వరంగల్ పట్టణం విశ్వకర్మ వీధికి చెందిన శ్రీరామోజు శ్రీదేవి భర్త వెంకటేశ్వర్లు 24-12-2021న జీపీఎన్ రోడ్లోని కల్యాణలక్ష్మి షాపింగ్ మాల్, వరంగల్లో రూ.1400కు ఫ్యాన్సీ పట్టుచీర కొనుగోలు చేశాడు. చీర తయారీలో లోపాలను గమనించిన వినియోగదారుడు మరుసటిరోజు చీర మార్చి ఇవ్వాలని సదరు షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని కోరాడు. అయితే, ఇందుకు వారు నిరాకరించారు.
దీంతో శ్రీరామోజు శ్రీదేవి వరంగల్లోని వినియోగదారుల కమిషన్లో వ్యక్తిగతంగా 15-02-2022 రోజున ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న వినియోగదారుల కమిషన్ కోర్టుకు హాజరు కావాలని ప్రతివాదులకు నోటీసులు పంపించింది. కల్యాణ లక్ష్మి షాపింగ్ యజమాన్యం.. కమిషన్ నోటీసులను తిరస్కరించడంతోపాటు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ గట్టుపల్లి నాగరాజు, మెంబర్లు వీ జనార్దన్రెడ్డి, సీహెచ్ సంధ్యారెడ్డితో కూడిన బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. చీర కొనుగోలు ధర రూపాయలు 1400లను 12 శాతం వడ్డీతో చెల్లించాలని లేదా చీరను మార్చి వినియోగదారుడికి అందజేయాలని, అలాగే, మానసిక ఇబ్బంది కలిగించినందుకు రూ. 5000, రవాణా ఖర్చులు రూ. వెయ్యిని 30 రోజుల వ్యవధిలో వినియోగదారుడికి చెల్లించాలని తీర్పు వెల్లడించింది.