హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జార్ఖండ్ పర్యటన విజయవంతమైంది. శుక్రవారం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివాసీ గిరిజన పోరాటయోధుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకొన్న కేసీఆర్కు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సొరేన్తో కేసీఆర్ సమావేశమై ఆయన ఆశీస్సులు తీసుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బాసటగా నిలిచినందుకు శిబు సొరేన్కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా శిబు సొరేన్ ఆశీస్సులు తీసుకున్నారు. అనతికాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలవటం పట్ల శిబు సొరేన్ సంతోషం వ్యక్తంచేశారు. దేశ రాజకీయాలను కేసీఆర్ విశేషంగా ప్రభావితం చేస్తున్నారని, ఇదే ఒరవడి కొనసాగించాలని సొరేన్ చెప్పినట్టు సమాచారం. హేమంత్ సొరేన్ కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇష్టాగోష్ఠిగా కలుసుకొన్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవిత.. హేమంత్ సొరేన్ సతీమణి కల్పన సొరేన్కు తెలంగాణలో తయారైన వస్ర్తాలు బహూకరించారు.