హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నాయకుల అవసరం దేశానికి ఉన్నదని, ఆయనతో కలిసి నడుస్తామని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతాంగ సంస్థ షెట్కారీ సంఘటన్ నాయకుడు విజయ్ జావెన్దియే చెప్పారు. రైతాంగ సమస్యలపై కేసీఆర్కు ఉన్న అవగాహన దేశంలోని మరే ముఖ్యమంత్రికీ లేదని అన్నారు. 50 ఏండ్లుగా దేశంలో అనేక రైతాంగ పోరాటాలను, రైతు నాయకులను చూశానని, కానీ, కేసీఆర్ తరహాలో గొప్పగా ఆలోచించే వ్యక్తిని తాను చూడలేదని పేర్కొన్నారు. రాష్ట్రం లో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, రైతుల జీవితాలు మెరుగుపడ్డ తీరును అధ్యయనం చేసేందుకు 26 రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రతినిధుల బృందంలో విజయ్ జావెన్దియే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లో ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు తెలంగాణతో గతం నుం చీ పరిచయం ఉన్నదని, రాష్ట్ర విభజనకు ముం దు కూడా తెలంగాణకు వచ్చానని, అప్పటికీ, ఇప్పటికీ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
రైతుబంధు విప్లవాత్మక పథకం
రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటంతో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గా ల్లో చర్చ మొదలైంది. కేసీఆర్ అన్ని వర్గాల్లో చర్చను రేకెత్తించగలిగారు. రైతు సమస్యలపై చైతన్యం తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో భూమి ఉన్న రైతులందరికీ ఏడాదికి ఎకరానికి రూ.10,000 ఇస్తున్నది. దీనిని అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. కేం ద్రం కూడా ఈ తరహా కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. కేంద్రం ఇచ్చే నిధుల్లో వివక్ష ఉన్నది. అందరికీ రావడం లేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు మరో రూ.4 వేలు కలిపి ఇస్తున్నది. అది కూడా ఎం పిక చేసిన కొందరికే ఇస్తున్నది. రైతుబంధును తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినపుడు మేం సంబురపడ్డాం. అప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యాదేవరాజన్కు ఫోన్ చేసి మాట్లాడా. ఆమె రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులు వేస్తామని, చెక్కుల రూపంలో, ఆన్లైన్లో వెళ్తాయని చెప్తే ఆశ్చర్యపోయా. ఇంత పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేను. రైతుబంధు ఒక విప్లవాత్మకమైన పథకం. దేశ రైతాంగానికి ఈ తరహా పథకం అవసరం.
ప్రధానమంత్రిలో చలనం ఉండదు
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసే ప్రయత్నం చేశా. ఆయనకు అప్పుడప్పుడు లేఖలు రాస్తుంటా. ఇప్పటివరకు ఆయన నుంచి రైతులకు ఉపయోగపడే ఒక్క నిర్ణయాన్ని కూడా చూడలేదు. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదు. రైతు సమస్యలపై మహారాష్ట్రలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతుల పక్షాన ఉండి కొట్లాడుతా అని కేసీఆర్ చెప్తున్నారు. ఆయనను స్వాగతిస్తున్నాం. ఆయన ఆలోచన మాకు నచ్చింది. కలిసి నడుస్తాం.
విధానాలు రూపొందించేది కేంద్రం.. బద్నాం అయ్యేది రాష్ట్రాలు
దేశంలో విచిత్ర పరిస్థితి ఉన్నది. వ్యవసాయ చట్టాలను కేంద్రం రూపొందిస్తున్నది. వాటి అమలు బాధ్యతను రాష్ట్రాలపై నెట్టేస్తున్నది. మంచి జరిగితే కేంద్రం ఖాతాలో వేసుకొంటున్నది. ఉదాహరణకు గోధుమ, వరి వంటి పంటలను రైతులు పండిస్తారు. రాష్ర్టాలు వాటిని కొనుగోలు చేయాలి. వీటి ఎగుమతి విధానాన్ని కేంద్రం నిర్ణయిస్తున్నది. రాష్ర్టాల, రైతుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్రమే ఎగుమతుల విధానాన్ని రూపొందించి రుద్దుతున్నది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. గోధుమలు, బియ్యం విషయంలో ఇదే జరుగుతున్నది. వ్యాపారులను కూడా మనం ఏమీ అనలేని పరిస్థితి. అసలు దోషి కేంద్రమే. రాష్ర్టాలను సంప్రదించకుండా చట్టాలు చేయడం, విధానాలు రూపొందించడంతోనే సమస్య వస్తున్నది. కేంద్రం వ్యవసాయాన్ని నియంత్రించాలని చూడకూడదు. రాష్ర్టాలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకొంటే బాగుంటుంది.