30 గోర్లను మేపడానికి వెళ్లి చిక్కుకున్న వైనం
పెరుగుతున్న మానేరు వాగు ఉధృతి
కాపాడేందుకు రంగంలోకి పోలీసులు, రెస్క్యూ టీం
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్లలోని మానేరు వాగులో గొర్రెల కాపరి చిక్కుకున్నాడు. సిరిసిల్లలోని సాయి నగర్కు చెందిన మొగిలి చంద్రమౌళి తన ముప్పై గొర్రెలను మేపేందుకు వాగు సమీపంలోకి తీసుకెళ్లి అక్కడే చిక్కుకొన్నాడు. సిరిసిల్లలోని నెహ్రూ నగర్ చెక్ డ్యామ్ ప్రాంతంలోని మానేరు వాగు నది మధ్యలో చంద్రమౌళితో పాటు గొర్రెలు కూడా చిక్కుకున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మానేరు వాగు ఉధృతి పెరిగింది.
భయాందోళనతో అక్కడే బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం చూస్తున్నాడు. మంగళవారం ఉదయం స్థానికులు చంద్రమౌళిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సిరిసిల్ల తంగాలపెళ్లి పోలీసులు చంద్రమౌళిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లతో చంద్రమౌళి కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.