హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఏర్పాటుచేసిన షీటీమ్స్, వాటి పనితీరు ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా మారింది. షీ టీమ్స్ గురించి తెలుసుకున్న పలు రాష్ర్టాలు, అక్కడ కూడా ఇదే విధంగా మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేస్తున్నాయి. కేరళ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కోల్కతా, నాగపూర్, ముంబై పోలీస్ అధికారుల బృందాలు హైదరాబాద్లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయాన్ని, షీటీమ్స్, భరోసా కేంద్రాలను సందర్శించాయి. పోలీస్ అకాడమీలో సైతం తెలంగాణ షీటీమ్స్, భరోసా కేంద్రాల పనితీరు, మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలను ప్రత్యేకంగా బోధిస్తున్నారు.
మన ఎస్వోపీలకు ఫిదా
మహిళల భద్రత కోసం సీఎం కేసీఆర్ ఆలోచనలతో ఏర్పాటైన షీటీమ్స్ పనితీరును మహిళా భద్రత విభాగం ఇంచార్జి స్వాతిలక్రా నేతృత్వంలో ఉన్నతాధికారులు ఇతర రాష్ర్టాల పోలీసులకు వివరిస్తున్నారు. షీటీమ్స్ బృందాల పనితీరు, వారికి నిరంతర శిక్షణ, క్షేత్రస్థాయిలో ఆ బృందాలు మఫ్టీలో ఉంటూ ఆధారాల సేకరణ, విధుల నిర్వహణ, నిందితులకు కౌన్సెలింగ్, కేసుల నమోదు, బాధిత మహిళల, యువతుల వివరాలు బయటికి వెల్లడి కాకుండా తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ర్టాల వారికి ఆసక్తికరంగా మారాయి. బాధిత మహిళల కోసం పోలీస్ భవనాల్లో కాకుండా బయట షీటీమ్స్ కార్యాలయాల ఏర్పాటు, షీటీమ్స్ వాడుతున్న టెక్నాలజీలు ఇలా అనేక అంశాలపై రూపొందించిన ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్)ను వివరిస్తున్నారు.
తెలంగాణ మాదిరిగానే గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్లో షీటీమ్స్ను ఏర్పాటుచేశారు. ఒడిశా కూడా షీటీమ్స్ పేరుతోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్లో శక్తిటీమ్స్, నాగ్పూర్లో లేడీస్ స్పెషల్, కోల్కతా, రాజస్థాన్లో స్థానిక పేర్లపై షీటీమ్స్ ఏర్పాటయ్యాయి.
కేరళ పోలీస్ బృందం, ముంబై డీప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలోని బృందాలు షీటీమ్స్ పనితీరును తెలుసుకుని వెళ్లాయి. కర్నాటక వాళ్లు ఫోన్ ద్వారా వివరాలు అడిగి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఉమెన్సేఫ్టీ వింగ్ ఇంచార్జి స్వాతిలక్రా 2019లో స్వయంగా వెళ్లి షీటీమ్స్ గురించి వివరించారు.
హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా 340 షీటీమ్స్ నిత్యం విధుల్లో ఉంటున్నాయి. తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తుండడంతో ఇతర రాష్ర్టాల అధికారులు మన దగ్గరికి వచ్చి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే తొమ్మిది రాష్ర్టాల వారు తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రొబేషనరీ ఐపీఎస్లు, కొత్త రిక్రూటీలకు సైతం తెలంగాణ షీ టీమ్స్, భరోసా కేంద్రాల నిర్వహణపై నేషనల్ పోలీస్ అకాడమీలో తరగతులు నిర్వహిస్తున్నాం.