హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం 4 లక్షల మంది లబ్ధిదారుల మార్క్ను దాటింది. ప్రభుత్వం ఇప్పటివరకు 4.13 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి 21 గొర్రెల చొప్పున మొత్తం 86.73 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సొసైటీల్లో 7.31 లక్షల మందిని గొర్రెల పంపిణీకి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.
వీరికి రూ.11 వేల కోట్ల ఖర్చుతో గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తొలి విడతలో రూ.6 వేల కోట్లతో 3.93 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేసింది. రెండో విడతలో రూ.5 వేల కోట్ల నిధులతో 3.38 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేపట్టింది. రెండో విడతలో ఇప్పటికే 20 వేల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2,426 మందికి, యాదాద్రి భువనగిరిలో 1,775, సంగారెడ్డిలో 1044, పెద్దపల్లిలో 998, నారాయణపేటలో 997, మహబూబ్నగర్లో 987, హనుమకొండ జిల్లాలో 936 మందికి గొర్రెలను పంపిణీ చేశారు.
ముమ్మరంగా రెండో విడత
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఏమాత్రం సహకారం అందించని కేంద్ర ప్రభుత్వం చివరకు గొర్రెల పంపిణీ పథకం విషయంలోనూ షరామామూలుగా రుణం రాకుండా అడ్డుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్సీడీసీ నుంచి రుణం మంజూరు కాకపోతే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందని కేంద్రం లోని మోదీ సర్కారు భావించినట్టుంది. కానీ, గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపడం, వారిని ఆర్థికంగ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి పథకాన్ని ఆయన ఆగనిస్తారా.. అందుకే ఎన్సీడీసీ రుణం ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ఖాజానా నుంచి నిధులు విడుదల చేసింది. దీంతో అధికారులు వేగంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 20 వేల వరకు యూనిట్లను పంపిణీ చేశారు. అవకతవకలకు తావులేకుండా ఆరోగ్యంగా ఉన్న గొర్రెలను లబ్ధిదారులకు అందిస్తున్నారు.
గొర్రెల లబ్ధిదారులు : 4.13 లక్షలు
తొలి విడత లబ్ధిదారులు : 3.93 లక్షలు
రెండో విడత లబ్ధిదారులు(ఇప్పటివరకు) : 20,000
ఒక్కొక్కరికి పంపిణీ చేసినవి : 21 గొర్రెలు
మొత్తం పంపిణీచేసిన గొర్రెలు : 86.73 లక్షలు