హైదరాబాద్ : వైఎస్సార్.టీ.పీ. నాయకురాలు షర్మిల రైతుబీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆమె ముందుగా వాస్తవాలు తెలుసుకుని.. ఆ తర్వాత రైతుబీమా విషయంపై మాట్లాడాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు విజయవంతంగా రాష్ట్రంలో అమలు అవుతున్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రైతు బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్.ఐ.సీ. ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి అమలు చేస్తున్నారని తెలిపారు.
ఎల్.ఐ.సీ., జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏండ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని, ఆ నిబంధనల ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని ఆయన అన్నారు. కేంద్రం, పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇన్సూరెన్స్ సహా వివిధ పథకాలు 60 ఏళ్ల లోపు ఉన్న వారికే వర్తిస్తున్నాయని, ఈ విషయం మీకు తెలియదా..? అని ఆయన షర్మిలను సూటిగా ప్రశ్నించారు.
వాస్తవాలు ఇలా ఉంటే షర్మిల మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇలాంటి పథకాలను షర్మిల మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.