వేములవాడ టౌన్, సెప్టెంబర్ 26: రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోని నాగిరెడ్డిమండపంలో శైలపుత్రి అలంకారంలో అమ్మవారు కొలువుదీరారు. ఉదయం 5.30 గంటలకు ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో స్వస్తి పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, పంచగవ్యమిశ్రణం, అఖండ దీపస్థాపన, కలశస్థాపన, గాయత్రి ప్రతిష్ఠ, 12 మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం, ఐదురుగు రుత్విక్కులతో గాయత్రీ హవనం నిర్వహించారు.
ఉదయం రాజరాజేశ్వరస్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరీదేవికి 9 మంది రుత్విక్కులతో మహాభిషేకం, లలితా సహస్రనామ సహిత చతుష్యష్టి పూజ, శ్రీ దేవీ భాగవతం, సప్తపతి, లలితోపాఖ్యానం, లలితా సప్తశతి పారాయణాలు నిర్వహించారు. రాత్రి మూలవిరాట్టు రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి లలితా సహస్రనామ సహిత చతుష్యష్టోపచార పూజ, కన్యకా సువాసినీ పూజలు ఘనంగా నిర్వహించారు. రాత్రి అమ్మవారిని పెద్దసేవపై ఊరేగించారు.