హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సీఎస్ సోమేశ్కుమార్ రిలీవైన నేపథ్యంలో రాష్ట్రప్రభు త్వం 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శాంతికుమారిని కొత్త సీఎస్గా నియమించింది. శాంతికుమారి బీఆర్కే భవన్లో నూతన సీఎస్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం శాంతికుమారి ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకంపై ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత బీఆర్కే భవన్లో సీఎస్ శాంతికుమారి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలతోపాటు అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సహచర అధికారుల సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేయడానికి కృషిచేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షల వెల్లువ
నూతన సీఎస్ శాంతికుమారికి పలువురు ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీ అంజనీకుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, అటవీశాఖ సలహాదారు శోభ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి సీఎస్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఐఏఎస్లు సం దీప్ కుమార్ సుల్తానియా, లోకేశ్ కుమార్, అర్వింద్కుమార్, రఘునందన్రావు, శ్రీదేవి, వాకాటి కరుణ, అనితా రామచంద్రన్, అధర్ సిన్హా, మహేశ్దత్ ఎక్కా, హన్మంతరావు, వెంకటేశ్వర్లు, నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, రాహుల్ బొజ్జా, అడిషనల్ సెక్రటరీ సైదా, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.