నాపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్
రావుకు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలతోపాటు అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సహచర అధికారుల సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేయడానికి కృషిచేస్తా. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
– శాంతికుమారి
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి నియమితులయ్యారు. మాజీ సీఎస్ సోమేశ్కుమార్ రిలీవ్ అయిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శాంతికుమారిని కొత్త సీఎస్గా నియమించింది. ఈ మేరకు జీఏడీ కార్యదర్శి వీ శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెనువెంటనే సీఎస్గా బాధ్యతలు చేపట్టిన శాంతికుమారి తన పేరుపై పలు రికార్డులను లిఖించుకున్నారు.
తెలంగాణ తొలి మహిళా సీఎస్గా నిలిచారు. ఉమ్మడి ఏపీ మొదలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లో సీఎస్గా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. తనకు అప్పగించిన ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారని, ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తారని శాంతికుమారికి మంచి పేరున్నది. తెలంగాణ రాష్ర్టావిర్భావం తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిన టీఎస్ఐపాస్ అమలులో శాంతికుమారి కీలక పాత్ర పోషించారు.
సమర్థురాలైన అధికారిగా విశేష సేవలు
శాంతికుమారి 1965 ఏప్రిల్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివారు. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. మూడు దశాబ్దాలనుంచీ ఐఏఎస్గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, సిల్ డెవలప్మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో జాయింట్ కలెక్టర్గా, మెదక్ కలెక్టర్గా, ఇంధన శాఖ, సాంఘిక సంక్షేమశాఖల్లో డిప్యూటీ సెక్రటరీగా, డైరెక్టర్గా, సర్వే సెటిల్మెంట్ విభాగంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల్లో కమిషనర్గా, జాయింట్ సెక్రటరీగా, సెర్ప్ అదనపు సీఈవోగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 మే నుంచి 2018 మార్చి వరకు సీఎంవోలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన శాంతికుమారి.. రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణ టీఎస్ఐపాస్ అమలులో కీలకపాత్ర పోషించారు. ‘ఇండస్ట్రీ చేజింగ్ సెల్’కు స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు.
ఆ తర్వాత వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం అటవీశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2013 ఆగస్టు నుంచి 2015 మే వరకు దాదాపు రెండేండ్లపాటు ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. 1990 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అరుణాచల్ ప్రదేశ్లోని ఛాంగ్లాంగ్ జిల్లా కలెక్టర్గా సైతం విధులు నిర్వహించారు.
నాలుగో మహిళా సీఎస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఇప్పటి ఉభయ తెలుగు రాష్ర్టాల్లో శాంతికుమారి నాలుగో మహిళా సీఎస్గా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో సతీనాయర్, 2012లో మిన్నీ మాథ్యూస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించారు. సతీనాయర్ ఆరునెలలు, మిన్నీ మాథ్యూస్ 10 నెలలపాటు సీఎస్గా కొనసాగారు. వారిద్దరూ కేరళకు చెందినవారు. రాష్ట్ర విభజన అనంతరం 2019లో ఆంధ్రప్రదేశ్ సీఎస్గా నీలమ్ సాహ్ని రెండు నెలలపాటు ఆ పదవిలో ఉన్నారు. ఈ కోవలో శాంతికుమారి నాలుగో మహిళ.
తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఆమె 2025 ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు. ఆమె పూర్తికాలం ఆ పదవిలో కొనసాగితే, దీర్ఘకాలంపాటు పనిచేసిన మహిళా సీఎస్గా మరో రికార్డును సైతం సొంతం చేసుకోనున్నారు. తెలంగాణ రాష్ర్టానికి ఆరో సీఎస్గా శాంతికుమారి వ్యవహరించనున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మొదటి సీఎస్గా రాజీవ్ శర్మ నియమితులయ్యారు. ఆయన తర్వాత ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్, ఎస్కే జోషి, సోమేశ్ కుమార్ సీఎస్లుగా పనిచేశారు.