సిరిసిల్ల టౌన్, మార్చి 21: తన కొడుకుతో ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు బీజేపీ నాయకులు.. తన ఇంటి జాగ, ఇల్లు గుంజుకొని మోసం చేశారని, న్యాయం అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు షమీం సుల్తానా ఆరోపించింది. మంగళవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు వివరాలు వెల్లడించింది.
సిరిసిల్ల పట్టణానికి చెందిన తనకు తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఉన్నదని పేర్కొన్నది. తన కొడుకుతో ఉన్న వివాదాలను పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు బీజేపీ నేతలు తన ఇంటి స్థలంతోపాటు ఇల్లును తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పింది. కొడుకుతో వివాదం సద్దుమణిగాక తిరిగి స్థలం, ఇల్లును తన పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని ఆ ఇద్దరు నేతలు చెప్పారని బాధితురాలు వాపోయింది. దీంతోపాటు టెక్స్టైల్ పార్కులో ఉన్న ఇల్లును కూడా వారికి అమ్మినట్టుగా బాండ్ పేపర్ రాసుకున్నారని తెలిపింది.
ఇల్లు, స్థలం రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా తానే భరించుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకుతో గొడవలు జరిగినప్పుడు ఒత్తిడిలో ఉండి స్థలం, ఇండ్లు వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశానని ఆందోళన చెందుతున్నది. ఇప్పుడు గొడవలు సద్దుమణిగాయని, తన ఆస్తులు తనకు రిజిస్ట్రేషన్ చేయాలని అడిగితే పట్టించుకోవడం లేదని, పైగా మరోసారి వీటి గురించి అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నది. పోలీసులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటున్నది.