KCR | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆయన రోడ్షో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చైతన్యవంతమైన మెదక్ నియోజకవర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని కోరుతున్నా. ఐదునెలల కిందట తెలంగాణ ఎట్లా ఉండే.. ఎంత ఆగమాగమైతుంది మీరందరూ గమనిస్తున్నరు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని అరచేతిలో వైకుంఠం చూపించి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని దగా, మోసం చేసింది. వాళ్లకు ఇష్టం వచ్చిన వాగ్ధానాలు చేశారు. ఏ వాగ్ధానం, హామీలు నెరవేర లేదు. ఒకటే ఒకటి ఉచిత బస్సు పెట్టారు. దాంతో మహిళలు కొట్టుకుంటున్నరు. ఆటో కార్మికులు రోడ్డునపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. రైతుబంధు అందరికీ వచ్చిందా? 9వ తారీఖు అన్నడు.. మళ్లీ ఎన్నికల అని పెట్టి దాన్ని ముంచే ప్రయత్నం చేస్తున్నరు’ అంటూ ధ్వజమెత్తారు.
‘మహిళలకు రూ.2500 వచ్చినయట కదా? మొన్న ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా గెలిచింది. మరి రాలేదా? రూ.15వేలు వచ్చినయట కదా? అంటే మోసమైందా? దగా అయ్యిందా? పాతవి కూడా వాళ్లు అమలు చేసే పరిస్థితి లేదు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని రూ.30వేలకోట్లు రుణమాఫీ చేశాం. ముఖ్యమంత్రి చెప్పిండు రూ.2లక్షల రుణం తీసుకుంటే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్త అన్నడు. మరి మాఫీ జరిగిందా? రైతుబంధు రాలేదు. ఏమీ రాలేదు. ఇలా 420 హామీలు.. ఆరు గ్యారంటీలు ఇచ్చారు. ఎన్నికల్లో గెలువంగనే చట్టబద్ధం చేస్తాం. మీ అందరికీ ఇస్తామని ఏం చేయలేదు. చేయకపోగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలోని స్కీమ్లను సరిగా అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తాని అని చెబుతున్నడు. దాంట్లో మెదక్ జిల్లా తీసేస్తా అంటున్నడు. జిల్లా ఉండాలంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి గెలవాలి. మెదక్ కోసం యుద్ధం చేద్దామా?’ అని ప్రశ్నించగా.. చేద్దామని జనం నినదించారు.
‘ఈ పాత జిల్లాలో పుట్టినవాడిని కాబట్టి.. చాలాప్రేమతో ఇక్కడ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా రామాయంపేట డివిజన్ చేసుకున్నాం. మీరు కోరిన కోర్కెలు నెరవేర్చినం. మీ మెదక్వాళ్లకు బాగా తెలుసు. ఇదే కాంగ్రెస్, టీడీపీ రాజ్యంలో మొత్తం ఘనపురం ఎలా నాశనం చేశారో.. అందరూ బాధలు అనుభవించారు. దాదాపు రూ.150కోట్లతో ఘనపురం ఆనకట్టను బాగా చేసి.. ఎత్తుపెంచి బ్రహ్మాండంగా అందించాం. వందపడకల ఆసుపత్రిని తెచ్చాం. దాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం 50 పడకలకు కుదించింది. ఏడుపాయల వనదుర్గ భవానీ జాతర ఘనంగా జరగాలని రూ.100కోట్లు మంజూరు చేశాం. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు చేస్తే దాన్ని రద్దు చేశారు. రామాయంపేట మున్సిపాలిటీకి రూ.25కోట్లు మంజూరు చేస్తే దాన్ని ముంచేసి వాపస్ తీసుకుపోతున్నరు. కొత్త హామీలు చేయకపోయినా పాత ప్రభుత్వంలో చేసిన మంజూరు వాటన్నింటిని ఈ రోజు రద్దు చేస్తున్నరు. మీరంతా గమనించాలి’ అని సూచించారు.