కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : వాంకిడి మండల కేంద్రం నుంచి దాబా గ్రామం వరకు పోలీసుల మొహరింపు.. శైలజకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన బంధువులు సైతం గ్రామంలోకి వెళ్లకుండా అడుగడుగునా ఆంక్షలు.. మీడియాకు నో ఎంట్రీ.. మృతురాలి ఇంటిచుట్టూ ఎటుచూసినా పోలీసులు.. 25 రోజులుగా కన్నీళ్లు దిగమింగుకున్న ఆ తల్లిదండ్రులు బిడ్డను కళ్లారా చూసి ఏడువలేని పరిస్థితి.. ఇదీ మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలోని శైలజ ఇంటి వద్ద కనిపించిన దృశ్యాలు. కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షల నడుమ విద్యార్థిని శైలజ అంత్యక్రియలు నిర్వహించారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన శైలజ అంత్యక్రియలు మంగళవారం పోలీసుల భద్రత, ఆంక్షల నడుమ నిర్వహించారు. ప్రజా సంఘాలు, బంధువులు ఆందోళనలు చేయకుండా మొహరించి ఉక్కుపాదం మోపారు. శైలజ మృతదేహం వద్దకు వెళ్లి నివాళులర్పించే అవకాశం కూడా ఇవ్వలేదు. వాంకిడి మండల కేంద్రంలోని ఎంట్రెన్స్ నుంచి దాబా గ్రామం వరకు ప్రధాన కూడళ్లు, మధ్యలో గ్రామాల వద్ద పోలీస్ క్యాంపులు ఏర్పాటుచేశారు. దాబా గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయటి వారు గ్రామంలోకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. మీడియాపై ఆంక్షలు విధించారు. అంత్యక్రియల కోసం వచ్చిన బంధువులను సైతం అడ్డుకున్నారు.
శైలజ అంత్యక్రియల నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీటీడబ్ల్యూవో రమాదేవి, వాంకిడి తహసీల్దార్ రియాజ్ అలీ సమక్షంలో గ్రామస్తులు శైలజ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్-టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, గిరిజన సంఘాల నాయకులు, గ్రామస్తులు శైలజకు కన్నీటి వీడ్కోలు పలికారు.
శైలజ కుటుంబానికి అండగా నిలవాల్సిన అధికారులు కేవలం ఇంట్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి సరిపెట్టారు. ఎక్స్గ్రేషియాపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో చర్చించిన తర్వాత ఈ విషయం తెలిపారు. శైలజ తల్లిదండ్రులు తుకారాం, మీరాబాయి తమకు ఐదెకరాల భూమి, ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు. అధికారులు మాత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటితో సరిపెట్టడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఫుడ్పాయిజన్తో చనిపోతే కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించకుండా పోలీసులు ఇంతటి నిర్బంధం పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదు. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యే. విద్యార్థి మృతిపై ప్రజాసంఘాలు స్పందించకుండా పోలీసులు ఉక్కుపాదం మోపారు. అర్ధరాత్రి నన్ను హౌస్ అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.
కెరమెరి, నవంబర్ 26 : శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, మాజీ జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి డిమాండ్చేశారు. మంగళవారం కెరమెరిలో మాలీ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. శైలజకు సరైన వైద్యం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడాడ్డారు. విద్యార్థి మృతికి బాధ్యత వహిస్తూ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఐదెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు పాల్గొన్నారు.