హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ భారీ జీఎస్టీ మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నకిలీ సంస్థలను సృష్టించి కోట్లాది రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందిన ఆరోపణలపై షా బ్యాటరీస్ డైరెక్టర్ టీఏ అమీర్హసన్ను అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీర్హసన్ తన సహచరుల ద్వారా మొత్తం 17 బోగస్ కంపెనీలను ఏర్పాటుచేసి, వాటి ద్వారా షా బ్యాటరీస్కు రూ.98.47 కోట్ల మేర అక్రమ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్టు తేలింది.
ఈ నకిలీ సంస్థలు ఐటీసీ బదిలీ చేసిన అనంతరం స్వచ్ఛందం గా తమ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకున్నట్టు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఈ 17 సంస్థలు ప్రతినెలా తమ జీఎస్టీ రిటర్న్స్ను ఒకే కంప్యూటర్ నుంచి దాఖలు చేసినట్టు బయటపడింది. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు సుమారు రూ.571 కోట్ల టర్నోవర్ను ప్రకటించినప్పటికీ, స్వచ్ఛందంగా కేవలం రూ.45.42 లక్షల పన్ను మాత్రమే చెల్లించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్టు అధికారులు వెల్లడించారు.