కామారెడ్డి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం.. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ జెండాకు వందనం చేయకుండా నిలబడ్డారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని తన ఇంటి వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ.. జాతీయ గీతం పాడుతున్న సమయంలో జెండాకు వందనం చేయలేదు. దీనిపై నాలుగు నిమిషాల నిడివి గల వీడియో మధ్యాహ్నం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో పలువురు మాజీ మంత్రి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అనేక సార్లు ప్రజలతో ఎన్నుకోబడి.. మంత్రిగా పని చేసిన షబ్బీర్ అలీకి జాతీయ జెండాకు వందనం చేయడం కూడా తెలియదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో తాజాగా నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలది కాదని కాంగ్రెస్ నాయకులు కొట్టిపారేస్తున్నారు.