SGD Pharma -Corning Inc | తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కోర్నింగ్ (Corning Inc), ఎస్జీడీ ఫార్మా (SGD Pharma) సంస్థలు ఆదివారం ప్రకటించాయి. రూ.500కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ సామగ్రి ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టనున్నాయి. బయో ఏషియా (Bio Asia 2023)లో సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు (Minister KTR) తో సమావేశం అనంతరం విషయాన్ని ఫార్మా సంస్థలు ప్రకటించాయి.
ప్రైమరీ ప్యాకేజింగ్ సరఫరా గొలుసును సురక్షితం చేయడం ద్వారా తెలంగాణలో ఫార్మా పరిశ్రమను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో భాగ్యసామ్యం కలిగి ఉన్నందుకు తాము గర్విస్తున్నామని ఎస్జీడీ ఫార్మా ఎండీ అక్షయ్ సింగ్ అన్నారు. సుమారు రూ.500కోట్లతో ఉద్దేశించిన ప్రాజెక్టుతో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 150 శాశ్వత ఉద్యోగాలు, 300 కంటే ఎక్కువ మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నదని పేర్కొన్నారు.
2024 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తామని, ఎస్ఈడీ ఫార్మా సహకారంతో తెలంగాణలో అడుగుపెడుతున్నందుకు సంతోషిస్తున్నామని కోర్నింగ్ సంస్థ ఎండీ సుధీర్ పిళ్లై పేర్కొన్నారు. ఫార్మా స్యూటికల్ ప్యాకేజింగ్ నాణ్యతను మెరుగుపరుస్తూనే కిష్టమైన ఔషధాల పంపిణీని వేగవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన కోర్నింగ్ – ఎస్ఈడీ ఫార్మా ప్రపంచ స్థాయి ఫెసిలిటీని ఏర్పాటు చేయనుండడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. ఫార్మాస్యూటికల్ సింగిల్ యూజ్ టెక్నాలజీ (SUT)లో సామర్థ్యాలను విస్తరించేందుకు తెలంగాణలో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెరికాకు చెందిన ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ప్రకటించింది. తక్కువ ఖర్చుతో కస్టమ్ మెడికల్, ఎస్యూటీ ఫార్మాలో వినియోగదారులకు మద్దతు ఇచ్చేందుకు ప్రపంచ స్థాయి ఫెసిలిటీని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏక్నాథ్ కులకర్ణి పేర్కొన్నారు.