హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఇడువని ఇగం.. జనాన్ని ఆగమాగం చేస్తున్నది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో రెండ్రోజులపాటు చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో చలి గాలులు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్తోపాటు ఏజెన్సీ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.
ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాల్లో 10.7, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 11.2, నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో 11.7, సంగారెడ్డి జిల్లా అల్మాయిపేటలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. చలితోపాటు విపరీతమైన దట్టమైన పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.