హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): అవసరం లేకున్నా కొన్ని ప్రైవేట్ దవాఖానలు కొవిడ్ పాజిటివ్ రోగులను చేర్చుకొని గందరగోళం సృష్టిస్తుండటంపై వైద్యారోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి లక్షణాలున్నవారిని దవాఖానలో చేర్చుకోవాలి? ఎవరు ఇంట్లోనే ఉండి వైద్యం పొందొచ్చనే అంశంపై స్పష్టత ఇస్తూ మంగళవారం ప్రైవేట్ దవాఖానలకు మార్గదర్శకాలు జారీచేసింది. మధ్యస్థ, తీవ్రస్థాయి లక్షణాలు న్న వారిని మాత్రమే ప్రైవేటు దవాఖానలు చేర్చుకోవాలని స్పష్టంచేసింది. వారిని దవాఖానలో చేర్చుకొనే సమయంలో పాజిటివ్ రిపోర్టు కోసం ఎదురుచూడకుండా వైద్యం అందించాలని ఆదేశించింది. శరీరంలో ఆక్సిజన్ 94 శాతం కంటే ఎక్కువ ఉండి, స్వల్ప లక్షణాలు, ఎలాంటి లక్షణాలు లేనివారు ఇంట్లో, కొవిడ్ కేర్ సెంటర్లలో ఉంటూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. అన్ని ప్రైవేట్ దవాఖానల ముందు పడకల వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. సాధారణ పడకలు, ఆక్సిజన్ పడకలు, ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉన్నాయో రియల్ టైం విధానంలో ప్రదర్శించాల్సి ఉంటుందని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలకు ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలో కొవిడ్ బాధితులకు సరిపడా పడకలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కలిపి 50 వేలకుపైగా పడకలు ఉన్నప్పటికీ కొందరి వల్ల పరిస్థితి గందరగోళంగా మారుతున్నది. హైదరాబాద్ సహా జిల్లాల్లోని కొన్ని ప్రైవేటు దవాఖానల్లో అవసరం లేకున్నా కరోనా రోగులను చేర్చుకొని డబ్బులు వసూలుచేస్తున్నాయి. దీనివల్ల నిజంగా అవసరమైనవారికి పడకలు కొరత ఏర్పడుతున్నది. మరోవైపు అవసరంలేని వారు చికిత్సకోసం డబ్బు ఖర్చుచేయాల్సి వస్తున్నది. పడకల వివరాలను గోప్యంగా ఉంచుతూ డిమాండ్ను బట్టి ఎక్కువ డబ్బులు వసూలుచేస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు వైద్యారోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు చెప్తున్నారు.