ఖానాపురం, మే 18 : పెండ్లి సామాన్లు తీసుకొచ్చేందుకు బయలుదేరిన ఆ కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారం రోజుల్లో పెండ్లి జరగాల్సిన ఇంట్లో ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలుకమ్మతండా జీపీ పరిధిలోని పర్శ్యతండాకు చెందిన గుగులోత్ ధన్సింగ్ తన చిన్న కూతురి వివాహం ఈ నెల 24న జరగాల్సి ఉన్నది.
ఇందుకోసం ధన్సింగ్ తన బంధువులతో కలిసి పెండ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు బుధవారం ఉదయం పర్శ్యతండా నుంచి ట్రాక్టర్లో నర్సంపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో ట్రాక్టర్ దూసముద్రం చెరువు కట్ట మీదుగా వెళ్తుండగా డ్రైవర్ తుమ్మచెట్టును తప్పించబోగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కట్ట కిందిభాగంలో పడిపోయింది.
ఈ ఘటనలో గుగులోత్ స్వామి (48), జాటోత్ బిచ్చమ్మ (62), గుగులోత్ సీత (26) అక్కడికక్కడే మృతిచెందగా జాటోత్ గోవిందు, గుగులోత్ శాంత, ధన్సింగ్, విజయ, మమత, వనజ, అశోక్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నర్సంపేట ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ గోవిందు (65), శాంతి (62) మరణించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వెంటనే దవాఖానకు వెళ్లి మృతుల బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసానిచ్చారు.