హైదరాబాద్, ఫిబ్రవరి1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర బడ్జెట్పై పలు ఉపాధ్యాయ సంఘాలు విస్మయం వ్యక్తంచేశాయి. తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశాయి. ఈ బడ్జెట్తో విద్యారంగం, వేతన జీవుల ఆశలు నెరవేరలేదని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి అభిప్రాయపడ్డారు. సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అభిప్రాయపడ్డారు. విద్యారంగాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసిందని టీపీటీఎఫ్ తెలిపింది.
కేంద్ర బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్గా ఉందని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలకు మేలు చేసే బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. హైస్పీడ్ రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్ట్లను రాష్ర్టానికి మంజూరుచేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ హైవే కారిడార్లలోను తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు.