లోక్సభలో 543 మంది ఎంపీలు.. రాజ్యసభలో 250 మంది సభ్యులు.. మొత్తం కలిపి 793 మంది. నామినేటెడ్ సభ్యులను కలుపుకొంటే.. దగ్గరదగ్గర 800 మంది పార్లమెంట్ సభ్యులు. వీళ్లందరికీ కేంద్రం ఒక టాస్క్ అప్పగించింది. ఏడాదికి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి చూపించాలని చెప్పింది. వాటికి ర్యాంకులిస్తామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే పథకాలతోపాటు.. నియోజకవర్గ అభివృద్ధి నిధులనూ వాడుకోవచ్చని సూచనలు కూడా చేసింది.
ఈ ఎంపీలు దత్తత తీసుకొన్న గ్రామాల్లో అత్యద్భుతంగా ప్రగతి సాధించిన గ్రామాలకు కేంద్రం ర్యాంకులను ప్రకటించింది. అత్యుత్తమమైన పది పల్లెల్లో ఏడు తెలంగాణవే కావడం అపూర్వ సన్నివేశం. టాప్ 20 గ్రామాల్లో 11 గ్రామాలు మన రాష్ర్టానివే కావడం చూసి యావత్ దేశం ఆశ్చర్యచకితమైంది. ఎలా? నిన్న మొన్న పుట్టిన రాష్ట్రం.. పైగా గ్రామీణ వ్యవస్థలో ఇంత వేగంగా ఎలా పురోగతి సాధించింది?
ఒక దార్శనికుడి పరిపాలనలో తెలంగాణలోని ప్రతి ఊరు మారిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్రాక్టర్ ఊరి స్వరూపాన్ని మార్చేసింది. చెత్తను ఏరేసింది. మురుగుకాల్వల్లో మురుగును తోడేసింది. ఊరంతా పచ్చదనాన్ని పరిచేసింది. శిథిలాలు తరలిపోయాయి. ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్.. మన పల్లెలను ముచ్చటగొలిపేట్టు చేశాయి. పైర్లు దాహార్తి తీర్చుకొంటున్నాయి. ఏరిన చెత్త కూడా సంపద సృష్టిస్తున్నది. పూడిక తీసిన చెర్ల నిండా నీళ్లతో మొగులు దిక్కు ఎదురుచూసే పనేలేదు. దోమల్లేవు.. ఈగలు లేవు.. సీజనల్ రోగాల జాడే లేదు. వంగిపోయిన కరెంటు స్తంభాల్లేవు.. పాడుబడ్డ ఇండ్లు లేవు.. నోరు తెరుచుకున్న బోర్లు లేవు. పానంపోతే అంత్యక్రియలకోసం వైకుంఠధామాలు వచ్చినయి. ప్రజలంతా కలిసి చర్చించుకోవడానికి కమ్యూనిటీ భవనాలు ఏర్పడ్డాయి. పంటలు ఆరబోసుకోవడానికి కల్లాలు వచ్చాయి. రైతులు సంఘటితం కావడానికి వేదికలు వచ్చాయి. వలసలు తిరుగుముఖం పట్టినయి. ఇవాళ తెలంగాణ పల్లెల్లో కన్నీళ్లు లేవు. ఆనందబాష్పాలు రాలుతున్నాయి. ఇది పల్లె ప్రగతి తీసుకొచ్చిన మార్పు. దేశవ్యాప్తంగా తెలంగాణ పల్లెలకు కీర్తి కిరీటాన్ని తొడిగిన ప్రగతి పథమిది.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 : గతంలో గ్రామాల్లో మురుగు నీటి కాల్వను ఎప్పుడోకాని శుభ్రం చేసేవారు కాదు. ఒకవేళ చేసినా అందులోనుంచి మట్టి తీసి పక్కన కుప్పపోసేవారు. రెండుమూడ్రోజులపాటు కంపుకొట్టిన ఆ కుప్ప మళ్లీ ఆ కాలువలోకే చేరేది. మరి నేడు.. పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలతో పల్లెలు పరిశుభ్రతతో అద్దాల్లా మెరుస్తున్నయి. పాతగోడలు, పాడుబడిన బావులు పోయి సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు కనపడుతున్నయి. హరితహారం మొక్కలతో పచ్చలహారంగా మారిపోయాయి. వేలాడే విద్యు త్తు తీగల స్థానంలో ఎల్ఈడీ లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నయి. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, ఇంటింటికీ మిషన్భగీరథ నల్లాల్లో శుభ్రమైన నీరు. మిషన్ కాకతీయతో కళకళలాడుతున్న చెరువులు.. గాంధీ కలలు కన్న నిజమైన గ్రామస్వరాజ్యాన్ని సాధించి చూపించాయి.
తెలంగాణ రాకముందే కార్యాచరణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై ఉద్యమకాలంలోనే ప్రస్తుత సీఎం కేసీఆర్కు ప్రత్యేక ఆలోచనలు ఉండేవి. సొంత రాష్ట్రంలో గ్రామాలు ఎలా ఉండాలో కలలు కన్నారు కేసీఆర్. నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకొన్న అంకాపూర్ గ్రామాన్ని మూడు దశాబ్దాల క్రితమే సందర్శించారు. గ్రామాభివృద్ధికి తీసుకొన్న చర్యలు, ప్రజల భాగస్వామ్యం, ప్రణాళికలు, అమలు గురించి తెలుసుకొన్నారు. ఆనాటి ఆలోచనలను సీఎం అయ్యాక అమలుచేశారు. పల్లెప్రగతి పేరుతో గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ను అందించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించారు.
ఇంటింటికి నల్లా నీరు
మంచినీటి సమస్యను తీర్చేందుకు సీఎం కేసీఆర్ మిషన్భగీరథకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ మంచినీటి సౌకర్యాన్ని అందించే గొప్ప కార్యక్రమం ఇది. ప్రస్తుతం ప్రతిరోజు ఒక్కొక్కరికి 100 లీటర్ల చొప్పున నల్లానీటిని అందిస్తున్నారు. రాష్ట్రంలో నూటికి నూరుశాతం ఇండ్లకు నల్లా ద్వారా మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా మనం అగ్రస్థానంలో నిలిచాం. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర జల్శక్తిశాఖ రాష్ర్టాలకు లేఖరాసింది. 15కు పైగా రాష్ర్టాలు ఈ పథకం అమలు విధానాన్ని స్వయంగా చూసి వెళ్లాయి. భగీరథకు హడ్కో మూడుసార్లు అవార్డు ఇచ్చింది. దీనిద్వారా 22,882 పాఠశాలలు, 27,310 అంగన్వాడీలకు కూడా శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నారు.
ట్రాక్టర్ తెచ్చిన మార్పు
గ్రామాల్లో చెత్త, శిథిలాలు తొలగించేందుకు, ఇతర అవసరాలు తీర్చేందుకు ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఉండాలని కేసీఆర్ సంకల్పించారు. 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలు సమకూరాయి. వీటి కోసం రూ.1,270 కోట్లు వెచ్చించారు. సేకరించిన చెత్తను డంపింగ్ షెడ్లకు తరలించి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారుచేస్తున్నారు. సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా గ్రామానికి ఆదాయం వస్తున్నది. విరివిగా మొక్కలు నాటి, ట్యాంకర్ ద్వారా నీటిని పోస్తున్నారు.
సీసీ రోడ్లు.. ఎల్ఈడీ వెలుగులు
గ్రామాల్లో 7,553 కిలోమీటర్ల సీసీ రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. వీటికోసం రూ.2,265 కోట్లు ఖర్చు చేసింది. విద్యుత్తు స్తంభాలకు ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, వీధిదీపాలకు మూడోవైరు, కూలిపోయే దశలో ఉన్న విద్యుత్తు స్థంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, వేలాడుతున్న విద్యుత్తు వైర్లను సరిచేయడం వంటివాటికోసం రూ.400 కోట్లకు పైగా ఖర్చుచేశారు.
మూడో వైరు అమర్చిన విద్యుత్తు స్తంభాల సంఖ్య :
52 వేలు -230 కిలోమీటర్లు
తుప్పుపట్టిన విద్యుత్తు స్థంభాల స్థానంలో
కొత్తవి అమర్చినవి : 2.33 లక్షలు
కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్తు మీటర్లు :13,497
దశాబ్దాల డిమాండ్కు మోక్షం
మూడు వేలకు పైగా తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చారు. వీటికి గిరిజనులే సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను భారీగా పెంచారు. సర్పంచ్లు, ఎంపీటీసీలకు రూ.6,500, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13 వేలు, జడ్పీ చైర్మన్లకు రూ.లక్ష గౌరవ వేతనం ఇస్తున్నారు. దేశంలోనే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇందుకోసం కొత్తగా 9,355 గ్రామ కార్యదర్శులను నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని పంచాయతీలకు 3,414 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య 12,769కి చేరింది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్ను ప్రభుత్వం నియమించింది.
డీఎస్ఆర్తో జవాబుదారీతనం
గ్రామ కార్యదర్శులు తమ గ్రామానికి సంబంధించిన పల్లెప్రగతి-రోజువారీ పారిశుద్ధ్య నివేదికలను పంపడానికి ప్రభుత్వం రూపొందించిన డీఎస్ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్ట్స్) యాప్ సత్ఫలితాలిస్తున్నది. యాప్ ద్వారానే హాజరు నమోదు చేస్తుండటంతో గ్రామ కార్యదర్శులు ఉదయం 7 గంటల కల్లా విధులకు హాజరవుతున్నారు. గ్రామ కార్యదర్శి ఆ గ్రామ పరిధిలోని అక్షాంశాలు, రేఖాంశాల పరిధిలోకి వెళ్తేనే అటెండెన్స్ యాప్ ఓపెన్ అవుతుంది. హాజరు పడ్డాకే డీఎస్ఆర్ యాప్ తెరుచుకొంటుంది. గ్రామంలో జరిగిన అభివృద్ధిని ఫొటోల రూపంలో యాప్లో అప్లోడ్ చేయాల్సి రావటంతో ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతున్నది. గ్రామాలకు నెలనెలా నిధులు విడుదలచేస్తున్నారు.
సంవత్సరం గ్రామపంచాయతీలకు నిధులు
2019-20 2,373
2020-21 2,730
2021-22 (10 నెలలు) 2,100
మొత్తం 7,203
రైతుల కష్టాలు తీర్చుతున్న కల్లాలు
పండించిన పంటను ఆరబోసుకోవడానికి వీలుగా రైతు కల్లాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రైతు కేవలం 10% మొత్తాన్ని చెల్లిస్తే, మిగిలిన 90% ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటివరకు 86,930 రైతు కల్లాలు మంజూరుచేయగా వీటిలో 20,372 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందుకు రూ.750 కోట్లతో ప్రణాళిక సిద్ధంచేశారు. రైతులను సంఘటితం చేయడానికి క్లస్టర్లవారీగా 2,601 రైతు వేదికలను రూ.573 కోట్లతో నిర్మించారు.
పల్లెకో ప్రకృతి వనం
ప్రతి గ్రామానికో పల్లె ప్రకృతివనం ఏర్పాటైంది. నర్సరీ వచ్చింది. ప్రతి మండలానికి ఒకటి చొప్పున పదెకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్కు కేటాయించారు.
మార్పు ఇదిగో..
ప్రకృతి వనాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజలు వాటిల్లో మార్నింగ్ వాక్ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఆక్సిజన్తోపాటు మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకొంటున్నారు. గౌరవంగా దహన సంస్కారాలు చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకోసం 12,745 వైకుంఠధామాలను నిర్మించారు. వీటికి రూ.1,563.40 కోట్లు ఖర్చు అయింది.
మార్పు ఇదిగో..
ఇంతకుముందు కులాలవారీగా శ్మశానవాటికలు ఉండేవి. ఇప్పుడు వైకుంఠధామాలతో సమాజంలో సామాజిక మార్పు మొదలైంది. ప్రజల్లో అందరూ సమానమేనన్న భావన కలుగుతున్నది.
కేసీఆర్ వల్లనే మన పల్లెలకు జాతీయ ఖ్యాతి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో తెలంగాణలోని పల్లెలు దేశంలోనే ముందువరుసలో నిలవడానికి సీఎం కేసీఆర్ గ్రామాలకు ఇస్తున్న ప్రాధాన్యమే కారణమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, గ్రామాల రూపు రేఖలు మారాయని ఆదివారం తెలిపారు. ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పల్లెలకు ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నామని, ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించామని గుర్తుచేశారు. దత్తత తీసుకున్న గ్రామాలను అభివృద్ధి చేసిన ఎంపీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్లు, కార్యదర్శులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను అభినందించారు.
దేశంలోనే ఉత్తమ మండలాలు
1. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం
2. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం
దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలు
1. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం
2. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్ గ్రామం
3. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం
4. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామం
5. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామం
6. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం చక్రపూర్ గ్రామం
పల్లె ప్రగతి ఫలితాలు ఇవీ.. ఓడీఎఫ్ ప్లస్
14,200 గ్రామాల్లో 13,794 (97శాతం) గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు ప్రకటించారు. ఈ స్థాయిలో మరే రాష్ట్రంలోనూ ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు లేవు. ఓడీఎఫ్ ప్లస్గా గుర్తింపు పొందిన గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటి నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించడం, చెత్త సేకరణకు ట్రాక్టర్, శ్మశానవాటికలు, ఇంకుడుగుంతల నిర్మాణం, రోడ్లపై నీరు నిల్వకుండా చేయడం లాంటి పనులు చేపట్టారు.
రోగాలు మాయం
పల్లె ప్రగతి ద్వారా ఇంటింటికీ ఇంకుడు గుంత నిర్మించారు. కమ్యూనిటీ గుంతలు నిర్మించారు. రోడ్లపై నీళ్లు నిల్వకాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొన్నారు. ఫలితంగా అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు తగ్గిపోయాయి. దీకితోడు మిషన్ భగీరథ నీళ్లు రావడంతో అతిసారం కూడా మాయమైపోయింది.
భూముల ధరలకూ రెక్కలు
పల్లె ప్రగతితో పల్లెలన్నీ పచ్చదనంతో, పరిశుభ్రంగా మారి కొత్త రూపును సంతరించుకొంటున్నాయి. అదే సమయంలో కాళేశ్వరం జలాలతో భూగర్భజలాలు ఉబికిరావటంతో పంటలు బాగా పండుతున్నాయి. వీటి ఫలితంగా గ్రామాల్లో భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎకరాలకొద్దీ భూములు అమ్ముతామన్నా కొనేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఒక్కో ఎకరం లక్షలు
తెచ్చిపెడుతున్నది.
పల్లె ప్రగతి మొత్తం ఖర్చు
8,867.77కోట్లు
నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో
7,203 కోట్లు
మొత్తంగా గ్రామాల అభివృద్ధికి ఖర్చు
16,070.77 కోట్లు
గ్రామాల్లో గౌరవిస్తున్నారు
పల్లెప్రగతి పనులను చూసి గ్రామస్థులు గ్రామ కార్యదర్శులకు గౌరవం ఇస్తున్నారు. అభిమానం చూపిస్తున్నారు. రోజూ ఉదయమే చెత్త సేకరిస్తుండటంతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. గ్రామాల బాగు కోసం పనిచేస్తున్నాం.
– అనగారి రవీందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1,
తాటికాయల గ్రామం, హనుమకొండ జిల్లా
ప్రజలకు మెరుగైన ఫలితాలు
పల్లెప్రగతి డీఎస్ఆర్ యాప్ ద్వారా ఉదయం 7 గంటలకే మా అటెండెన్స్ నమోదుచేస్తున్నాం. దీంతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థతోపాటు మాపై నమ్మకం ఏర్పడుతున్నది. పారిశుద్ధ్యం మెరుగుపడుతున్నది.
– సార్ల శ్రీనివాస్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, గట్టు భూత్కూర్, కరీంనగర్ జిల్లా