హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): స్థానిక రాజకీయ నాయకుల అండ.. అధికారుల అవినీతి పునాదులపై నిర్మిస్తున్న ఏడంతస్తుల అక్రమ భవనం శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, దంపతులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అంజయ్యనగర్కు చెందిన సాజిద్ స్థానిక మాజీ కార్పొరేటర్కు అనుచరుడిగా చెలామణి అవుతున్నాడు. స్థానికంగా స్థల యజమానులు, బిల్డర్లకు దళారీగా వ్యవహరిస్తూ అధికారుల నుంచి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా వ్యవహారాలను చక్కబెడుతుంటాడు. కొంతకాలంగా తానే బిల్డర్గా అవతారమెత్తి చిన్న చిన్న ప్లాట్లు కొని భవనాలు కట్టి విక్రయిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం అంజయ్యనగర్లో 50గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ భవనమే శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. మధ్యప్రదేశ్ నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు ఉమేశ్కార్(34), మోపత్(42) ఈఘటనలో మృతి చెందారు. వీరిలో ఒకరు ఎలక్ట్రీషియన్ కాగా, మరొకరు టైల్స్ పనిచేస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు ఈ భవనం పక్కనే ఉన్న జయదర్శిని రెసిడెన్సీ అపార్ట్మెంట్ వైపు కూలడంతో కొంత దెబ్బతిన్నది.
భవన శిథిలాలు పడటంతో నాలుగో అంతస్తులో ఉన్న దంపతులు రమణారెడ్డి, సంయుక్త గాయపడ్డారు. వీరిని స్థానిక దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై స్పష్టత రాలేదు. మున్సిపల్, హైడ్రా బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించేందుకు డ్రోన్లతో పాటు జాగిలాలను రంగంలోకి దింపారు. అయితే ఘటన జరిగిన వెంటనే బిల్డర్ సాజిద్ పరారైనట్టు తెలుస్తున్నది. దీంతో పోలీసులు సాజిద్పై కేసు నమోదుచేశారు. నాలాలపై నిర్మించిన కొన్ని భవనాలను గుర్తించామని, వాటిని తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది.