సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : నగర ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 టేకోవర్ వ్యవహారం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తున్న మెట్రో ఫేజ్-1ను స్వాధీనం చేసుకునేందుకు ఐఆర్ఎఫ్సీ నుంచి ఇప్పిస్తామన్న రూ. 13,600 కోట్ల రుణ ప్రక్రియ బెడిసికొట్టడంతో స్వాధీన ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. దీంతో ప్రభుత్వం ‘ప్లాన్ బీ’ సిద్ధం చేశామని ప్రకటన చేస్తూ… ప్రత్యామ్నాయ నిధుల సేకరణ అంశం కొలిక్కి రాలేదు. కనీసం ఈ విషయంలో పురోగతి కూడా నగరవాసులకు అంతు చిక్కని అంశంగా మారింది.
గతేడాది ఐఆర్ఎఫ్ సీ, హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్టీల మధ్య ఒప్పందం కుదిరినా నిధులు విడుదల కాలేదు. దీంతో ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిధులు (సిండికేట్ ఫైనాన్సింగ్) సమీకరించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా అప్పులు ఇచ్చే వారిని వెతుకునేందుకే సమయం సరిపోతుండటంతో టేకోవర్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్రం నియమించిన ఎస్బీఐ క్యాప్స్ ఏ మేరకు నిధుల సమీకరణకు సహకరిస్తుందనేది అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. దీంతోనే కేంద్రం చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం చక్కర్లు కొడుడుతోందనే తెలిసింది.
నగరవాసులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామని, మెట్రో స్వాధీనంతోనే మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చింది. అయితే దానికి అనుగుణంగా బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలు చేసినా అవి ఆచరణలోకి ఇప్పటివరకు రాలేదు. ఇందులో ప్రధానంగా అదనపు కోచ్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఫేజ్-1 నెట్ వర్ కోసం 60 కొత్త మెట్రో కోచ్లు కొనుగోలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు ఆ విషయంపై నిధుల సర్దుబాటు, ఒప్పందాలు వంటి విషయాలపై అధికారికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో, క్యాబ్, ఆటో సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కామన్ మొబిలిటీ యాప్ తెస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారు.
కానీ ఇప్పటివరకు ఈ అంశంలోనూ ఎలాంటి పురోగతి లేదు. ఆర్టీసీ ఆధికారులతో ఒకసారి సమావేశం నిర్వహించిన హెచ్ఎంఆర్ఎల్ అక్కడితో ఆ వ్యవహారాన్ని ముగించింది. మెట్రో, ఆర్టీసీ రెండింట్లోనూ ప్రయాణించేలా డైలీ, వీక్లీ, మంత్లీ కామన్ పాస్లు తేవాలని నిర్ణయించారు. మరోవైపు 122.9 కిలోమీటర్ల ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను త్వరితగతిన పరిషరించాల్సి ఉంది. ఇవేవి లేకుండా ప్లాన్ బీ పేరిట మెట్రో స్వాధీనం చేపడతామని సర్కారు ప్రకటనలు చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. మెట్రో స్వాధీనం, మెట్రో ఫేజ్-2 అంశాలను అధికారికంగా జరిగే ప్రక్రియలను పక్కనపెట్టి… ముందుగా నగరవాసులకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.