వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 9 : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. కేఎంసీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడ్డారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, మూడో సంవత్సరం విద్యార్థులపై వాట్సాప్ గ్రూపుల్లో కామెంట్స్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని సీనియర్లు.. జూనియర్లను టెర్రాస్పైకి పిలిచి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో జూనియర్లు క్షమాపణ కోరారు. అయినా సీనియర్లు జూనియర్లను మోకాళ్లపై కూర్చోబెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడినట్టు సమాచారం.
బాధితులు నేరుగాకాకుండా మెయిల్ ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, వరంగల్ పోలీస్ కమిషనర్, కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీకి వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. బాధితుల ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ.. తమ పరిధిలోని అంశాలను పరిశీలించి, ర్యాగింగ్కు పాల్పడిన ఏడుగురు సీనియర్లను మూడు నెలలపాటు తరగతులకు హాజరుకాకుండా సస్పెండ్ చేశారు. అలాగే, ఎంబీబీఎస్ పూర్తికాలం వరకు హాస్టల్ వసతిని రద్దు చేస్తూ కమిటీ తీర్మానించింది. కమిటీ సిఫార్సు మేరకు సదరు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య ఉత్తర్వులు జారీ చేశారు.