హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): మీరు ఏం చదివారు? అంటే ఇప్పటివరకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా అంటూ సమాధానాలు వచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో లెవల్ 4, లెవల్ 5.. లెవల్ 6 అంటూ చెప్పాల్సి వస్తుంది. వివిధ విద్యార్హతలకు స్థాయిలు (లెవల్స్ను) నిర్ణయించే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన విధానాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రేమ్వర్క్ ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. జనరల్ కోర్సులు, సాంకేతిక విద్య, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు విడివిడిగా లెవల్స్ నిర్ధారించనున్నట్టు తెలిపింది. దీంతో ఏ విద్యార్థి అయినా విదేశాలకు వెళ్లినప్పుడు ఏ లెవల్ పూర్తిచేసిందీ చెప్తే సరిపోతుంది. ఈ ముసాయిదాపై యూజీసీ రాష్ర్టాల అభిప్రాయాలను కోరింది.
క్రెడిట్స్ సాధించాల్సిందే..
క్రెడిట్స్ను సైతం యూజీసీ ఖరారు చేసింది. 40 క్రెడిట్స్ సాధిస్తే సర్టిఫికెట్, 80 క్రెడిట్స్ సాధిస్తే డిప్లొమా, 120 క్రెడిట్స్ సాధిస్తే డిగ్రీని జారీచేయవచ్చని పేర్కొన్నది. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు, సాంకేతిక నైపుణ్యాలను సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు యూజీసీ ఈ ప్రేమ్వర్క్ రూపొందించి, ఉన్నత విద్యను ఏడు స్థాయిలుగా యూజీసీ వర్గీకరించింది. గతంలో ఆరు స్థాయిలు ఉండగా, తాజాగా ఏడు స్థాయిలకు పెంచారు. గతంలో ఇప్పుడు సాధించాల్సిన క్రెడిట్స్ సంఖ్యలో మార్పులు చేయలేదు.