మల్హర్, ఫిబ్రవరి 26: తాడిచర్ల జెన్కో ఆధ్వర్యంలో ఏఎమ్మార్ కంపెనీ చేపడుతున్న బొగ్గు తవ్వకాలను తాడిచర్ల భూ నిర్వాసితులు సోమవారం అడ్డుకున్నారు. కొన్నేడ్లుగా డేంజర్ జోన్ లోపల ఉన్న గృహాలను తీసుకుంటామని సర్వే చేసి ఇప్పటికీ తీసుకోకపోవడంతో నిత్యం బ్లాస్టింగ్లతో ఇండ్లలోకి దుమ్ముధూళి చేరుతున్నదని తెలిపారు. ఆ ఇండ్లల్లో నివాసం ఉంటున్న తమకు శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య తీర్చేవరకు బొగ్గు తవ్వకాలు నిలిపివేయాలంటూ మైన్లో పనులను అడ్డుకున్నారు. ఏఎమ్మార్ కంపెనీ ఆధికారులు, కాటారం డీఎస్పీ వచ్చి నచ్చజెప్పినా వినలేదు. జెన్కో సీఈ సిద్ధయ్య హామీ ఇవ్వాలని పట్టుబట్టడంతో ఆయన అక్కడికి చేరుకొని నిర్వాసితులతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అయిందని నాలుగు నెలల సమయం ఇవ్వాలని కోరారు. బోర్డు అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.