హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): గిరిజన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మెరికల్లా తీర్చిదిద్దుతున్నది. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2,326 విద్యాలయాల ద్వారా 2.32 లక్షల మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నది. ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా 22 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ) కాలేజీల నుంచి ఎనిమిదేండ్లలో దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో 1,310 మంది గిరిజన విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, మెడికల్, ఇంజినీరింగ్, సెంట్రల్ యూనివర్సిటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలోని ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలోని మొత్తం 324 పాఠశాలలను ఆంగ్ల మధ్యమంలోకి మార్చారు. రాష్ర్టంలోని నాలుగు ఐటీడీఏల పరిధిలోని 271 ఆశ్రమ స్కూళ్లలో ప్రభుత్వం కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది. ఇందులో లాన్, ప్రొజెక్టర్, యూపీఎస్ వంటి సాంకేతిక అంశాలను బోధించేందుకు ఇన్స్ట్రక్టర్లను నియమించింది.
కంప్యూటర్ పుస్తకాలను కూడా విద్యార్థులకు అందించింది. ఆశ్రమ స్కూళ్లను ఈ-స్కూళ్లుగా తీర్చిదిద్ది మాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లిష్పై ప్రత్యేక తర్ఫీదుకు ఈ-క్లాసెస్ అడ్వాన్స్బేస్డ్ ఎడ్యుకేషన్పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. గిరిజన ఆశ్రమ స్కూళ్లల్లో 309 ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ను ఏర్పాటు చేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేవిధంగా ప్రభుత్వం గిరిజన విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నది.