పొలంలో నుంచే పంట చోరీ
జగిత్యాల జిల్లా వేంపేటలో ఘటన
మెట్పల్లి రూరల్, మే 8: కోసి పొలంలో ఎండబెట్టిన నువ్వుల కట్టలు దులిపి నువ్వులను ఎత్తుకెళ్లిన విచిత్ర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మారు రాజరెడ్డి గ్రామ శివారులోని మోతుగుండు ప్రాంతంలో ఎకరన్నర తోటలో నువ్వు పంట సాగు చేశాడు. ఇటీవలే కోసి కట్టలు కట్టి తోటలోనే ఎండబెట్టాడు. 15 రోజుల తర్వాత కట్టలు దులిపి నువ్వు పంటను తీయాల్సి ఉండగా శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నువ్వుల కట్టలను దులిపి నువ్వులను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం తోటకు వెళ్లిన రాజరెడ్డికి నువ్వు కట్టలు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించాడు. కట్టలు దులిపి నువ్వులను ఎత్తుకెళ్లినట్టు గుర్తించాడు.
సమీపంలోని ఎస్సారెస్పీ ఉపకాలువ వద్ద నువ్వులు పడి ఉండటాన్ని గమనించి దొంగలు చోరీ చేసినట్టు నిర్ధారించుకున్నాడు. సుమారు ఐదు క్వింటాళ్ల నువ్వులు దొంగతనం చేశారని, వాటి విలువ రూ.50 వేల వరకు ఉంటుందని రైతు తెలిపాడు. విషయాన్ని మెట్పల్లి పోలీసులకు ఫోన్ ద్వారా తెలిపినట్లు చెప్పాడు. వారం క్రితం మల్లాపూర్ మండలం ముత్యంపేట శివారులో కూడా ఇదే తరహాలో నువ్వుల పంట చోరీకి గురైంది. తోట నుంచే నువ్వుల పంట చోరీకి చేస్తుండటంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.