హైదరాబాద్ : అగ్నిప్రమాదాలు(Fire incidents), ప్రకృతి వైపరీత్యాల(Natural disasters) సమయంలో అగ్నిమాపక సిబ్బంది(Firemen) అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) కొనియాడారు. అగ్నిమాపక దళ వారోత్సవాలను(Fire Brigade Week celebrations) శుక్రవారం బేగంపేట లోని అగ్నిమాపక కేంద్రంలో ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ ఇటీవల రూబీ హోటల్, డెక్కన్ మాల్, స్వప్న లోక్ కాంప్లెక్స్ లలో జరిగిన అగ్నిప్రమాదాలు బాధాకరమన్నారు. ప్రమాదాలు సంబవించినప్పుడు ప్రాణాలను ఫణంగా పెట్టి మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) నాయకత్వంలో అగ్నిమాపక శాఖ ను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు.
నూతనంగా 43 ఫైర్ స్టేషన్(Fire stations) లను మంజూరు, బడ్జెట్ లో రూ. 32 కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అగ్నిమాపక శాఖకు అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా సీఎం, హోంమంత్రి ల దృష్టికి తీసుకెళతానని అన్నారు. అంతకు ముందు అగ్నిప్రమాదాల సమయంలో వినియోగించే యంత్ర సామగ్రీ, పరికరాలను పరిశీలించి అగ్నిమాపక సిబ్బంది రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన సిబ్బందికి మంత్రి, ఇతర అధికారులు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, జిల్లా ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ రావు, అదనపు జిల్లా ఫైర్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి, సికింద్రాబాద్ ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, అఖిల్ పాల్గొన్నారు.