తొర్రూరు ఆగస్టు 11 : రాజకీయాలకు అతీతంగా తాను సేవ చేస్తున్నట్లు, తన వద్ద డబ్బులు లేనప్పటికీ, పలువురు స్నేహితుల సహకారంతో వినూత్నంగా, విశేషంగా సేవా కార్యక్రమాలు తమ ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో యువతకు ఉచితంగా ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల జారీ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ రోజు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో తొర్రూరు పట్టణానికి చెందిన 150 మందికి ఉచిత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉషా దయాకర్ రావు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు వైద్య ఆరోగ్య శిబిరాలతో పాటు కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, ఉచిత శిక్షణ ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, ఉపాధి హామీ కూలీలకు లంచ్ బాక్సుల పంపిణీ, నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ, తాజాగా యువతకు డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ వంటి పలు కార్యక్రమాలను దిగ్విజయంగా చేపట్టినట్లు తెలిపారు.
సేవ చేస్తే ప్రజలు మర్చిపోరని తప్పకుండా అండదండలు అందిస్తారని మంత్రి అన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదని మంత్రి అన్నారు. ప్రజల ఆశీర్వాదాలు తనకి ఎప్పుడు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్సులు పొందిన అభ్యర్థులు, సంబంధిత శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.