హైదరాబాద్/ దుండిగల్, జూలై 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ మరోసారి విఫలమైంది. మధ్యాహ్నం సెషన్ (3 నుంచి 6 గంటలు)లో నిర్వహించే పరీక్షలో సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా దుండిగల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఐఏఆర్ఈ)లో సర్వర్ డౌన్ సమస్య వల్ల పశ్నపత్రాలు ఓపెన్ కాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సమస్యను ఢిల్లీలోని ఎన్టీఏ అధికారులకు ఈ మెయిల్ ద్వారా చేరవేశారు. రాత్రి వరకు ఎన్టీఏ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు పరీక్ష నిర్వహిస్తారా..? వాయిదా పడుతుందా..? అన్న విషయంపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. విద్యార్థులు రాత్రి 9గంటల వరకు కాలేజీ వద్దే నిరీక్షించారు. పరీక్ష నిర్వహణ డైలామాలో పడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. దుండిగల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.