నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 17: సెర్ప్, మెప్మా సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు, ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకొంటామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా ఆయా విభాగాల ఉద్యోగులు, సిబ్బంది సీఎం ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు. సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా కేంద్రాలతోపాటు పలు మండల కేంద్రాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, మెప్మా, సెర్ప్ సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆర్ఎంపీ, పీఎంపీలు సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. నిర్మల్లో ఐకేపీ, మెప్మా సిబ్బంది మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో అన్నింటినీ సాధించుకొన్నామని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లకు పుష్పాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. తమ జీవితాల్లో సీఎం వెలుగులు నింపారని వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధిహామీ, సెర్ప్ సిబ్బబంది సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేసి స్వీట్లు పంచుకొన్నారు.