హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏప్రిల్ నుంచి పేస్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తీరని కలగా మారిన పేస్కేల్ను కేసీఆర్ సర్కారు నెరవేర్చడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు 4 వేలమంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వంపై ఏటా రూ.42 కోట్లు అదనపు భారం పడనున్నది. సెర్ప్ ఉద్యోగులకు ప్రస్తుతం వేతనాల రూపంలో ఏటా రూ.192 కోట్లు చెల్లిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం, వారిని చైతన్యపర్చడం, బ్యాంకు రుణాలు ఇప్పించడంలో సెర్ప్ ఉద్యోగులది కీలకపాత్ర. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ప్రతి అంశంలోనూ ముందున్నాయి.
కేసీఆర్కు రుణపడి ఉంటాం
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ఏప్రిల్ నుంచి అమలు చేయాలని నిర్ణయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయానికి సెర్ప్ ఉద్యోగుల పక్షాన రుణపడి ఉంటాం. 23 ఏండ్లుగా సుమారు 4 వేల మంది ఉద్యోగులు సాధారణ వేతనాలతో పనిచేస్తున్నారు. సర్కారు తాజా నిర్ణయంతో ఉద్యోగులకు ఎంతో మేలు కలుగుతుంది.
–గంగారెడ్డి, సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు