జనగామ : దేశ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజునే మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవా సందర్భంగా జనగామ కలెక్టరేట్లో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలనుద్దేశించి జాతీయ సమైక్యతా దినోత్సవ ప్రాధాన్యతను, రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ మాట్లాడారు. అనంతరం మంత్రి గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ -2023 జిల్లా స్థాయి అవార్డు గ్రహీతలకు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను పంపిణీ చేసి, సత్కరించారు. జిల్లాలో ఉత్తమంగా నిలిచిన 40 గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులను అభినందించారు.
వారి పనితీరు వల్లే ఈ అవార్డులు దక్కాయన్నారు.
ఈ మధ్యే రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా ఇచ్చామని, ఆక్టోబర్ 2 వ తేదీన కేంద్రం ఇచ్చే అవార్డుల్లోనే మరోసారి రాష్ట్రం ఉత్తమ ఫలితాలు, అవార్డులు సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, డీసీసీ సీతారాం, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని, ఆర్డీవో మురళీ కృష్ణ, ఏసీపీ దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.