High Court | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానమేనని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. శని శింగనాపూర్, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల పరంపరలో రాష్ట్ర హైకోర్టు ముస్లిం మహిళలకు సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది. మసీదులు, జషన్లతోపాటు ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించాలని వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మహిళలు పురుషులకంటే ఏమాత్రం తక్కువ కాదని అభిప్రాయపడింది. పురుషుడికంటే స్త్రీ ఎలా తక్కువ అవుతుందని ప్రశ్నించింది. దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానులేనని, దేవునికి లింగ వివక్ష ఉండదని స్పష్టంచేసింది. పురుషుడి కంటే స్త్రీ తక్కువ అని భావిస్తే.. జన్మనిచ్చిన తల్లి కూడా మహిళేనని, తల్లి మనకంటే తక్కువ ఎలా అవుతుందని కోర్టు నిలదీసింది. నిర్దిష్టమైన కొద్దిరోజులు మినహా మహిళలు నిరభ్యంతరంగా ప్రార్థనా స్థలాల్లోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
మసీదులు, జషన్ (ఉత్సవాలు) తదితర పవిత్ర ప్రదేశాల్లోకి ప్రార్థనలు చేసుకొనేందుకు షియా ముస్లిం మహిళలను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ.. అంజుమన్ ఏ అలావి, షియా ఇమామియా ఇత్నా అసారి అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతిమా పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముతవలీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను అనుమతించడంలేదని ఆరోపించారు. మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని వక్ఫ్బోర్డుకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించడంలేదని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. వక్ఫ్బోర్డు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఖురాన్ ప్రకారమే ఎవరికైనా ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని, వారికి రాజ్యాంగం సమాన హకులను కల్పించిందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హకులను హరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతోపాటు ఖురాన్, బైబిల్, తోరా, భగవద్గీత, ఒక యోగి ఆత్మకథ తదితర గ్రంథాల్లోని అంశాలతోపాటు స్వామి వివేకాననంద మహిళల గురించి పేరొన్న పలు అంశాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి చదివి వినిపించారు. మహిళలను ప్రార్థనలు చేసుకొనేందుకు అనుమతించకపోవడాన్ని తప్పుపట్టారు. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం కల్పించిన హకులను కాలరాయరాదని అన్నారు. షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని ముతవలీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. మహిళలను నిషేధించడానికి గల కారణాలేమిటో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని వక్ఫ్బోర్డును ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
మహారాష్ట్రలోని శని శింగనపూర్ (శనీశ్వరుడి) ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దుచేస్తూ బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. ముంబైలోని హాజీ అలీ దర్గాలో పవిత్ర స్థలంలోకి మహిళలను అనుమతించాలని బొంబాయి హైకోర్టు 2016, ఆగస్టు 26న తీర్పు చెప్పింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలని ఆదేశిస్తూ 2018, సెప్టెంబర్ 29న సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.