హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు ఖాజా విరాహత్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే రెండుసార్లు పనిచేసిన విరాహత్.. తాజాగా జరిగిన సంఘ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా గెలుపొందారు.
రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయడానికి డిసెంబర్ 29తో గడవు ముగియగా.. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఒకే ఒక్క నామినేషన్ అందింది. దీంతో రిటర్నింగ్ అధికారి రవీంద్ర శేషు, సహాయ ఎన్నికల అధికారి మల్లయ్య.. విరాహత్ అలీ ఏకగ్రీవంగా గెలుపొందినట్టుగా ప్రకటించారు.
నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్రెడ్డి, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఎంఏ మాజిద్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్యభద్రత, ఇండ్ల స్థలాల సాధనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని విరాహత్ అలీ పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.