హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ టికెట్ తనదేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచే పోటీచేసి తీరుతానని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు స్పష్టంచేశారు. హైదరాబాద్ గాంధీభవన్లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘హన్మంతన్నా నువ్వే పోటీచేయాలి’ అని అక్కడి ప్రజలు కోరుతున్నారని, రాజీవ్గాంధీ ఉన్ననాటి నుంచి ఆ ప్రాంత ప్రజలతో మమేకమై పనిచేస్తున్నానని చెప్పారు. ‘బీసీలకు చట్టసభల్లో సముచిత న్యాయం ఉండాలంటారు, బీసీ కులగణన జరగాలని చెప్తారు, మరి బీసీ నేతలకు సీట్లివ్వరా? బీసీలంటే ఓట్లేసే మిషన్లేనా? ఇంకా ఎన్నిరోజులు ఓపికగా భరించాలి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం లోక్సభ టికెట్ అడుగుతున్న, కొత్తగా వచ్చినవాళ్లకు సీట్లిస్తామంటే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏమిటి? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కూడా పట్టుకొని ఉన్నానని గుర్తుచేశారు. తొలుత పార్టీలో రేవంత్రెడ్డిని వ్యతిరేకించినా, పీసీసీ అధ్యక్షుడయ్యాక ఔట్రైట్ సపోర్టు చేశానని చెప్పారు. తనలా పార్టీ కోసం పనిచేసినవాళ్లు జాతీయస్థాయిలో కూడా ఎవరూ ఉండరని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సీట్లు కాకుండా ఉన్న సీట్లన్నీ అప్పర్ క్లాస్ వాళ్లే తీసుకుంటున్నారని, మరి బీసీలకు సీట్లివ్వరా అని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో పోటీ చేస్తానంటే టికెటివ్వలేదని, ఇప్పుడు ఊరుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఊరుకుంటే న్యాయం జరిగేలా లేదని పేర్కొన్నారు.
1990లోనే సీఎంను అయ్యేవాడిని..
పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా 1990లోనే తనను ముఖ్యమంత్రిని చేయాలని ఆనాడే రాజీవ్గాంధీ అనుకున్నారని, ఆనాడు తన వయసు కేవలం 41 ఏండ్లేనని, అప్పటి పార్టీ సీనియర్లు అడ్డుకున్నారని వీ హన్మంతరావు గుర్తు చేశారు. ఇప్పుడేమో వయసు మీదపడినా అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని పరిస్థితులను బయటకు చెప్తే.. ‘కడుపు కోసుకుంటే పేగులు బయటపడ్తాయి’ అన్నట్టుగా ఉంటుందని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. అందుకే తాను ఎక్కువగా మాట్లాడటం లేదని చెప్పారు. ఇటీవల పార్టీ తరఫున రాజ్యసభ స్థానాన్ని కూడా అడగలేదని, ఖమ్మం సీటే కావాలని ఆనాడే అడిగానని, ఇప్పుడూ అడుగుతున్నానని చెప్పారు. టికెట్ అడిగేందుకు తనకు అన్నిరకాల అర్హతలు ఉన్నాయని వీహెచ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తనకే న్యాయం జరగకపోతే ఇక కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.