హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు. 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్పై సీఎం హోదాలో ఉన్న వ్యక్తి పరుషపదజాలంతో మాట్లాడితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. తెలంగాణలోని ప్రతి రంగంపైనా కేసీఆర్కు పట్టు ఉన్నదని, దానిలో భాగంగానే నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టారని చెప్పారు. కానీ రేవంత్ విషయ పరిజ్ఞానం, కనీస అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేఆర్ఎంబీపై ప్రజలకు అసత్యాలు వివరించేలా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక, చేతకాక, వాటిని పక్కదారి పట్టించడానికి రేవంత్ తిట్ల దండకాన్ని అందుకున్నారని ఆరోపించారు.