మహబూబ్నగర్ : చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ వృత్తులలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ద్వారా వారు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. అందు కోసం జిల్లా కేంద్రంలో శాశ్వతంగా స్వయం ఉపాధి, అభివృద్ధి, శిక్షణ కేంద్రం భవన నిర్మాణాన్ని చేపడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సోమవారం ఆయన జిల్లా పరిషత్ మైదానంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందిన 96 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఫ్రిడ్జ్ మెకానిక్, మొబైల్ సర్వీసింగ్, కేబుల్ టీవీ ఇనస్టాలేషన్, డొమెస్టిక్ ఎలక్ట్రిషన్ల్లో మూడు నెలల పాటు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..చదువుకున్నవారికి వారి నైపుణ్యాలను అభివృద్ధి పరిచేలా తమ శాఖ పరిధిలో ఉన్న యువజన సర్వీసుల శాఖ ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించి వారు జీవితంలో స్థిరపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ కోసం ఒక మంచి భవనాన్ని నిర్మించి అక్కడ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కౌన్సిలర్లు, సర్పంచులు చదువుకున్న నిరుద్యోగులను గుర్తించి వారు ఆయా కోర్సుల ద్వారా శిక్షణ పొందేలా అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.