హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ): రాఖీ పర్వదినం వేళ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుక ప్రకటించింది. సెప్టెంబర్ 2న డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించి హైదరాబాద్ నగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేయనున్నది. ఈ మేరకు బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ పరధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ఇతర మంత్రులు సమీక్ష నిర్వహించారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గంలో 500 మంది చొప్పున 12 వేల మందిని ఆన్లైన్ డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో బుధవారం నాలుగు నియోజకవర్గాల్లో 500 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేశారు. ఇండ్లు పంపిణీ చేసే 8 ప్రాంతాలను అధికారులు ప్రకటించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 8 ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నటు పేర్కొన్నారు. విడతల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. సమావేశంలో మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, మూడు జిల్లాల కలెక్టర్లు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో టెలి కాన్ఫరెన్స్ సమీక్షలో పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం పట్టాలు పంపిణీ ప్రాంతాలు