హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో త్వరలో ఏడు వేల నర్సింగ్ పోస్టుల భర్తీకి సెలక్షన్ లిస్టు విడుదలకు ముందే ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని 317 జీవో ప్రభావిత నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు. కొత్త జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగుల విభజనకు గత ప్రభుత్వం ‘317 జీవో’ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనేకమంది పట్టణాల నుంచి పల్లెలకు, ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడిన కొందరు జిల్లాలకు బదిలీ అయ్యారు. తమకు సొంత ప్రాంతంలో కాకుండా ఇతర జోన్లో పోస్టింగ్ ఇచ్చారని సుమారు 350-400 మంది స్టాఫ్నర్సులు గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడంతో కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తున్నదని, తిరిగి పాత స్థానాలకు పంపించాలని కోరారు. మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ‘317 జీవోను సమీక్షిస్తాం’ అని హామీ ఇచ్చింది. తాజాగా 7,094 స్టాఫ్నర్స్ పోస్టుల భర్తీకి వెరిఫికేషన్ కూడా పూర్తయింది. వీటికి సెలక్షన్ లిస్టు విడుదల చేసేలోగా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. కొత్తవారికి పోస్టింగ్స్ ఇస్తే తమ సొంత ప్రాంతంలో ఖాళీలు భర్తీ అవుతాయని, దీంతో వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదని చెప్తున్నారు. కాబట్టి ఆలోగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులకు, మంత్రి దామోదర రాజనర్సింహకు వారు వినతి పత్రం ఇచ్చారు.
ఎన్వోసీ లేకుండానే పరీక్షకు హాజరు
ప్రభుత్వం ఇటీవల స్టాఫ్నర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు అనేకమంది 317 జీవో ప్రభావిత స్టాఫ్ నర్సులు కూడా హాజరయ్యారు. సర్వీస్ పోయినా పర్వాలేదని, సొంత జిల్లాలో కొత్త పోస్టింగ్ వస్తుందని వారు భావించారు. ఇందులో సుమారు 200 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కు కూడా హాజరైనట్టు తెలిసింది. అయితే.. సర్వీస్లో ఉన్న నర్సులు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో ‘ఎన్వోసీ’ (నో అబ్జక్షన్ సర్టిఫికేట్) సమర్పించాల్సి ఉంటుంది. కానీ 200 మంది ‘ఎన్వోసీ’ తీసుకోకుండానే సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరైనట్టు తెలిసింది. దీంతో అర్హులైన ఇతర అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతారని ఆందోళన మొదలైంది. పలువురు అభ్యర్థులు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మెరిట్ లిస్ట్ను మరోసారి పరిశీలిస్తున్నట్టు సమాచారం. వారిని ఆ జాబితా నుంచి తొలగించి, తుది సెలక్షన్ లిస్ట్ విడుదల చేసేలోగా తమను సొంత జిల్లాలకు పంపాలని 317 జీవో ప్రభావిత నర్సులు కోరుతున్నారు.
హామీని అమలు చేయండి
ప్రభుత్వం కొత్త నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇచ్చేలోగానే 317 ప్రభావిత నర్సుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలి. ముందుగా వారిని రీ లొకేట్ చేసి, ఆ తర్వాత మిగతా ఖాళీల్లో కొత్తవారితో భర్తీ చేస్తే న్యాయం జరుగుతుంది.
-లక్ష్మణ్, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి
జోన్ మార్చండి
నేను హైదరాబాద్లోనే చదువుకున్నా. ఇక్కడే స్టాఫ్నర్స్గా ఉద్యోగం చేస్తున్నా. 317 జీవో అమలులో భాగంగా నాకు హైదరాబాద్ జోన్కు బదులుగా, జోగులాంబ గద్వాల జోన్ కేటాయించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో 317 జీవోను సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మా పోస్టులను సమీక్షించి, జోన్ మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.
– హరిత, నర్సింగ్ ఆఫీసర్