హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రైతుకు నాణ్యమైన విత్తనం అందినప్పుడే… వ్యవసాయం లాభసాటిగా మారుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలకు సంబంధించి విస్తృతంగా పరిశోధనలు జరుగాల్సిన అవసరం ఉందన్నారు. ఈజిప్ట్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్(ఇస్టా) సదస్సులో నిరంజన్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రపంచంలో 80కోట్లమంది ప్రజలు ఆకలితో, 200కోట్ల మందికి పైగా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల అన్నిదేశాలకు అత్యంత అవసరమని పేర్కొన్నారు. అధిక దిగుబడిని సాధించడానికి నాణ్యమైన విత్తనోత్పత్తి జరుగాల్సిన అవసరం ఉందన్నారు. 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
తెలంగాణలో నాణ్యత హామీ వ్యవస్థలను మెరుగుపరచడంలో ఇస్టాతో కలిసి పనిచేయడం సంతృప్తినిస్తున్నదని నిరంజన్రెడ్డి తెలిపారు. విత్తన పరిశోధనలను ప్రోత్సహించడంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని దేశాలతో పంచుకోవడంలో ఇస్టా భాగస్వామ్యాన్ని మరింత కోరుకుంటున్నట్లు చెప్పారు. విత్తన పరిశ్రమ వృద్ధిరేటు ప్రపంచవ్యాప్తంగా 5శాతంగా ఉండగా.. భారత్లో అది 12-15 శాతంగా ఉందన్నారు. భారత విత్తన పరిశ్రమ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉందని, దేశీయంగా తెలంగాణ విత్తన పరిశ్రమలకు కేరాఫ్గా మారిందని మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు.
2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో తెలంగాణ విత్తన పరిశ్రమ 85శాతం వృద్ధిరేటును సాధించినట్లు ఆయన వివరించారు. అనేక బహుళజాతి కంపెనీలతో సీడ్హబ్గా మారిన తెలంగాణ.. దేశ విత్తన అవసరాల్లో మూడోవంతు తీరుస్తున్నదని వెల్లడించారు. 20కి పైగా దేశాలకు తెలంగాణ నుంచే విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని మంత్రి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి, విత్తన పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని వివరించారు.
రాష్ట్ర వ్యవసాయోత్పత్తి 2014-15లో 20.7 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండగా.. ప్రస్తుతం అది 38.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు వృద్ధి చెందిందని వివరించారు. 2019లో హైదరాబాద్లో జరిగిన ఇస్టా కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సు తెలంగాణ విత్తనరంగం బలోపేతానికి ఎంతో దోహదం చేసిందని నిరంజన్రెడ్డి చెప్పారు. ఇస్టా గుర్తింపుతో ప్రపంచస్థాయి విత్తన ప్రయోగశాల ఏర్పాటు వంటి కొత్త కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ఈ సదస్సులో ఇస్టా పూర్వ అధ్యక్షుడు డాక్టర్ క్రెగ్ ఎంసీ గిల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అండ్రూస్ వైస్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, ఇస్టా వైస్ చైర్మన్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.