పొలంలో నాట్లేయడం రోజులతరబడి పని. పల్లెల్లో కూలీలు దొరకని పరిస్థితుల్లో.. కైకిలి మరింత సమస్య. ఇప్పుడు ఆ కష్టం తీరనున్నది. ఇప్పటికే పురుగుమందు చల్లేందుకు వాడుతున్న తరహాలోనే త్వరలో వరినాట్ల పని కూడా డ్రోన్లే చేసిపెట్టనున్నాయి. వ్యవసాయ వర్సిటీతో కలిసి ‘మారుత్’ సంస్థ రూపొందిస్తున్న డ్రోన్తో.. ఒకేసారి ఆరు వరుసల్లో విత్తడం పూర్తిచేయొచ్చు. ఇద్దరు మనుషులుంటే చాలు ఎకరం పని.. గంటలోనే అయిపోతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని వరినాట్లకు ఉపయోగించడాన్ని పరిశీలిస్తున్నప్పటికీ త్వరలోనే ఇతర పంటలకూ విస్తరించే అవకాశముంది.
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): వరి సాగులో రైతులకు త్వరలో కష్టాలు తీరనున్నాయి. నాట్లు వేసేందుకు కూలీల కోసం వెతకాల్సిన పని లేకుండా తక్కువ ఖర్చుతో వేగంగా విత్తనాలు వేసే ప్రయోగానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. వరి నాటుకు బదులుగా డ్రోన్లతో నేరుగా విత్తనాలు వేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. దీనిలో భాగంగా వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ‘మారుత్’ డ్రోన్ల తయారీ సంస్థతో కలిసి నాబార్డ్ సాయంతో ఇప్పటికే రెండు దఫాలుగా ప్రయోగాలు నిర్వహించారు. ఈ ప్రయోగాల్లో గుర్తించిన పలు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
ఖర్చులతోపాటు సమయం ఆదా
ప్రస్తుతం వరి నాట్లకు కూలీలు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త విధానంతో ఈ సమస్య పరిష్కారమవడంతోపాటు తక్కువ ఖర్చుతో వేగంగా విత్తనాలను నాటేందుకు వీలవుతుంది. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో వరి నాట్లు వేయాలంటే పది మంది కూలీలు రోజంతా కష్టపడాల్సి ఉంటుం ది. ఇందుకు నారు మడి ఖర్చు, కూలీల ఖర్చులు కలిపి రూ.6-7 వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అదే డ్రోన్ ద్వారా అయితే కేవలం ఇద్దరితో, 70 శాతం తక్కువ ఖర్చుతో గంటలోనే పని పూర్తవుతుంది. అంతేకాకుండా విత్తనాల వినియోగం కూడా తగ్గుతుంది. ఎకరం పొలంలో వరి నాట్లకు అవసరమైనంత నారును పెంచేందుకు సాధారణ పద్ధతిలో 30 కిలోల విత్తనాలు అవసరమవుతాయని, డ్రోన్ ద్వారా అయితే ఎకరానికి 15 కిలోల విత్తనాలు సరిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
వరినాట్లు వేయడానికి వినియోగించే డ్రోన్
మున్ముందు మరిన్ని పంటలకు
ప్రస్తుతం డ్రోన్ ద్వారా విత్తనాలు వేసే ప్రయోగాలను సాగులో మాత్రమే నిర్వహిస్తున్నామని, మున్ముందు ఈ విధానాన్ని మొక్కజొన్న, కంది, పెసర, సోయా చిక్కుడు లాంటి పంటలకు కూడా విస్తరించేందుకు కృషిచేస్తున్నామని శాస్త్రవేత్తలు, ‘మారుత్’ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇదే జరిగితే రైతులకు కూలీల సమస్య తప్పడంతోపాటు ఎంతో పెట్టుబడి ఆదా అవుతుంది.
పనితీరు ఇలా..
వరి సాగుకు నారుతో నాటు వేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ, కొత్త విధానంలో నారును నాటడానికి బదులు మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసిన పొలంలో డ్రోన్ సాయంతో క్రమ పద్ధతిలో జార విడుస్తారు. ఇందుకోసం ఆ డ్రోన్కు ప్రత్యేకంగా రూపొందించిన పైపు లాంటి ‘సీడ్ డిస్పెన్సింగ్ డివైజ్’ను అమరుస్తారు. దీని ద్వారా ఒకేసారి ఆరు వరుసల్లో విత్తనాలను వేసుకోవచ్చు. ప్రతి వరుసలో విత్తనాలకు మధ్యన 10 సెంటీమీటర్లు.. రెండు వరుసల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీనికి సంబంధించిన పేటెంట్ హక్కుల కోసం ‘మారుత్’, వ్యవసాయ వర్సిటీ దరఖాస్తు చేయనున్నాయి.