హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సురక్ష’ పత్రిక మాత్రమే కాదని.. పోలీసులకు సమాచార వారధి అని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన ‘సురక్ష’ శతదినోత్సవ వేడుకల్లో ఆయన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాల అనుభవం ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారులు, సిబ్బంది సలహాలను ప్రచురించడం ద్వారా విధుల్లోకి కొత్తగా వస్తున్న యువ పోలీసులకు ఇది ఒక దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. తాను స్వయంగా ప్రారంభించిన సురక్ష ఆన్లైన్ డైలీ వంద రోజుల వేడుకలోనూ పాల్గొనడం ఆనందంగా ఉన్నదని అన్నారు. డిజిటల్ రూపంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో సిబ్బందికి చేరువవుతున్నదని తెలిపారు.