Vande Bharat Express | సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో కొత్తగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు వారంలో గురువారం మినహా మిగతా ఆరు రోజులు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఇప్పటికే వందే భారత్ ఎక్స్ పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే.
ఈ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ తీసుకువచ్చిన ఈ రైలు వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండగా.. ఈ క్రమంలో మరో రైలును సైతం ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ప్రస్తుత రైలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు నడుస్తుంది. కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విశాఖపట్నానికి చేరుకుంటుంది. రైలు 12న ప్రధాని వీసీ ద్వారా ప్రారంభించనుండగా.. 13 నుంచి రెగ్యులర్గా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
15వ తేదీ నుంచి ప్రయాణానికి సంబంధించిన 12న అడ్వాన్స్డ్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ రైలు సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ (20707-20708) ఎక్స్ప్రెస్ ఉదయం 5.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50గంటలకు విశాఖపట్నం చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగుతుందని తెలిపింది. ఈ రైలులో ఏడు చైర్కార్ కోచ్లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్కార్ కోచ్లుంటాయని.. 530 సీటింగ్ కెపాసిటీతో నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.