Gajwel | గజ్వేల్ అర్బన్, జూన్ 28: రైల్వే స్టేషన్ నిర్మించి ఏండ్లు గడుస్తున్నా రైలు ప్రయాణం అందుబాటులోకి రాలేదన్న గజ్వేల్ ప్రజల ఆవేదనకు త్వరలోనే పుల్స్టాప్ పడనుంది. మరో రెండు, మూడు నెలల్లోనే కాచిగూడ నుంచి సిద్దిపేట వరకు రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గం నిర్మాణంలో భాగంగా 2021లో గజ్వేల్ వరకు, 2022లో కొడకండ్ల వరకు, ఇటీవల దుద్దెడ వరకు రైల్వే సేఫ్టీ కమిషన్ పనుల తనిఖీలు పూర్తి చేసింది. ప్రస్తుతం సిద్దిపేట వరకు కొనసాగుతున్న రైల్వేలైన్ పనులు చివరి దశలో ఉన్నాయి. సిద్దిపేట వరకు రైల్వే సేఫ్టీ కమిషన్ పరిశీలన పూర్తయితే.. ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్లో రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను నడిపే అవకాశం ఉంది.
2021 నాటికే గజ్వేల్ వరకు రైల్వేలైన్ పూర్తికావడం, రైల్వేస్టేషన్ అన్ని హంగులతో రూపుదిద్దుకున్నా.. రైళ్ల నిర్వహణ భారం దృష్ట్యా రైల్వేశాఖ రైళ్లను నడపడానికి ముందుకురాలేదు. రైతులకు ఎరువుల కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎరువుల రవాణా కోసం గూడ్స్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. గత ఏడాది జూన్ 27న ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎరువులతో వచ్చిన గూడ్స్ రైలుకు స్వాగతం పలికి గజ్వేల్లో రేక్పాయింట్ను ప్రారంభించారు. గజ్వేల్ రేక్పాయింట్కు ఏడాది కాలంగా చేరుకున్న దాదాపు 15 వేల టన్నులకు పైగా ఎరువులు.. ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లాతోపాటు సమీప జిల్లాలకు అతి తక్కువ సమయంలో సరఫరా అవుతున్నాయి.
సికింద్రాబాద్లో పెరిగిన రద్దీతో
ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వస్తున్న రైళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగి స్టేషన్ రద్దీగా మారుతున్నది. రైళ్లను నిలపడానికి లైన్లు సరిపోకపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చెందిన రైళ్లను గజ్వేల్ స్టేషన్లో నిలుపుతున్నారు. కొద్ది రోజులుగా సికింద్రాబాద్లో నిలుపాల్సిన అదనపు రైళ్ల కోసం గజ్వేల్ స్టేషన్ను వినియోగిస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు తిరిగి సికింద్రాబాద్కు రప్పిస్తున్నారు. రైళ్ల రద్దీ దృష్ట్యా భవిష్యత్తులో గజ్వేల్ను కూడా జంక్షన్లా వినియోగించడానికి రైల్వేశాఖ యోచిస్తున్నది.
ఆగస్టు చివరికల్లా సిద్దిపేటకు రైలు
రైల్వే లైన్, బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే.. ఆగస్టులో రైల్వే సేఫ్టీ కమిషన్ అధికారులు సిద్దిపేట వరకు తనిఖీలు చేస్తారు. ఈ పనులు పూర్తయితే.. ప్రస్తుతం గజ్వేల్ వరకు కొనసాగుతున్న ఎరువుల రవాణాతోపాటు సిద్దిపేట వరకు ప్రయాణికుల రవాణా సేవలు కూడా ఆగస్టు, సెప్టెంబర్ చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. సిద్దిపేట వరకు రైళ్ల రాకపోకలు ప్రారంభమైతే కాచిగూడ-సిద్దిపేట మధ్య రైల్వే సేవలను ప్రజలు వినియోగించుకోనున్నారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్కు రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వాణిజ్య పరంగా కూడా రైళ్ల వినియోగం పెరిగి ఈ మార్గంలో రైల్వే శాఖకు ఆదాయం సమకూరనుంది. సిద్దిపేట నుంచి కాచిగూడ వరకు రైలు అందుబాటులోకి వస్తుండగా.. తిరుపతి, చెన్నై, బెంగళూరు తదితర ప్రధాన నగరాలకు కూడా ఇక్కడి నుంచి రైళ్లను నడిపే అవకాశం ఉన్నది. త్వరలో రైలు ప్రయాణం అందుబాటులోకి రానుందన్న సమాచారంతో గజ్వేల్, సిద్దిపేట ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.