హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ వాదనే నిజమని తేలింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం నెరవేరబోదని తేటతెల్లమైంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునలే ఈ విషయాన్ని విస్పష్టంగా తేల్చిచెప్పేసింది. దీంతో కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి ఇక అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ఒక్కటే దిక్కుగా మారింది. ఇదే విషయమై రాష్ట్ర ఏర్పాటు నుంచీ తెలంగాణ డిమాండ్ చేస్తున్నా కేంద్రం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది.
ఇదీ సెక్షన్ 89 కథ
నదీ పరీవాహక ప్రాంత విస్తీర్ణం, భౌగోళిక, వాతావరణం తదితర అంశాల ప్రాతిపదికన రాష్ర్టాలకు ఆయా నదీ జలాల్లో నీటి వాటాను కేటాయిస్తారు. అంతర్జాతీయ జల సూత్రాలు కూడా అదే ప్రతిపాదికన నీటి పంపిణీ చేపట్టాలని నిర్దేశిస్తున్నాయి. కేంద్రంలోని నాటి కాంగ్రెస్ సర్కారు అందుకు విరుద్ధంగా ఏపీ పునర్విభజన చట్టాన్ని రూపొందించింది. చట్టంలో సెక్షన్ 89 నిబంధనను పొందుపరచి దాని ప్రకారం అప్పటికే ఆయా రాష్ర్టాలు వినియోగంలో ఉన్న నదీ జలాలను మాత్రమే ప్రాజెక్టులవారీగా పంపిణీ చేయాలని నిర్దేశించింది. సెక్షన్ 89 ద్వారా తెలంగాణకు ఒరగబోయేది ఏమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సర్కార్ ఆదినుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయం మరోసారి తేటతెల్లమైంది.
పదేండ్లుగా సాగదీసిన కేంద్రం
ఏపీ పునర్విభవజన చట్టం సెక్షన్ 89 ప్రకారం నీటిని పంపిణీ చేస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని రాష్ట్ర సర్కారు మొదటి నుంచీ వాదిస్తున్నది. పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటివాటాలను తేల్చాలని డిమాం డ్ చేస్తున్నది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి నీటి వాటా తేల్చాలని 2014 జూలై 14న వినతిపత్రం అందజేశారు. తెలంగాణ అభ్యర్థనపై సలహా ఇవ్వాలని కేంద్రం అదే ఏడాది ఆగస్టు 29న న్యాయశాఖను కోరింది. దానిపై న్యాయశాఖ 2014 సెప్టెంబర్ 8న తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తెలంగాణ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. అయినప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
తెలంగాణ అభ్యర్థనను పునఃసమీక్షించాలని న్యాయశాఖను కోరుతూ కాలయాపన చేసింది. అప్పటికే ఏడాది గడిచిపోవడం, కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టులో వాదనలు కొనసాగుతున్న క్రమంలోనే తెలంగాణకు అనుకూలంగా న్యాయశాఖ ఇచ్చిన సలహాను కేంద్ర జలవనరుల శాఖ నవంబర్ 17, 2015లో ఆమోదించింది. ఆ తరువాత 20 రోజులు తిరగకుండానే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నది. అక్కడితో ఆగకుండా తన సలహాను పునఃసమీక్షించుకోవాలని డిసెంబర్ 7, 2015న న్యాయశాఖను కేంద్రం మరోసారి కోరింది.
ఆ తరువాత తెలంగాణ ఎన్నిలేఖలు రాసినా సమాచారం ఇవ్వకుండా కేంద్రం నిరాకరిస్తూ వచ్చింది. దీంతో అక్టోబర్ 6, 2020న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ ట్రిబ్యునల్ అంశంపై పట్టుబట్టారు. దిగొచ్చిన కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించింది. కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలా? ప్రస్తుతమున్న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కే సెక్షన్ 3 ప్రకారం నీటి వాటాలు పంపిణీ చేసే అధికారాలను కల్పించాలా? అనేదానిపై న్యాయశాఖ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. అందులో కూడా ఒక మెలిక పెట్టింది. ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన కేసును తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఆ తర్వాతనే న్యాయ సలహా కోరతామని షరతు విధించింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలోని కేసును ఉపసంహరించుకొని ఇప్పటికీ ఏడాదిన్నర కావస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని కేంద్రం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని తెలంగాణ సాగునీటి రంగ ఇంజినీర్లు మండిపడుతున్నారు. ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో ఇకనైనా సెక్షన్ 3 ప్రకారం నదీజలాల పునఃపంపిణీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారాల్లేవని తేల్చిచెప్పిన ట్రిబ్యునల్
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు న్యాయమైన నీటి పంపకాలను చేసే అధికారాలు తమకు లేవని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ 2 చైర్మన్ బ్రిజేష్కుమార్ తాజాగా తేల్చిచెప్పారు. తెలంగాణ సర్కారు ఆదినుంచీ చేస్తున్న వాదన కూడా ఇదే. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు తెలంగాణ సర్కారు 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవోను నిలుపుదల చేయాలని కోరుతూ ఏపీ సర్కారు ట్రిబ్యునల్లో ఐఏ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్పై ఇటీవల ట్రిబ్యునల్ చైర్మన్ తీర్పును వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన చట్టం సెక్షన్-89 కింద ప్రాజెక్టులకు సమానమైన కేటాయింపులు చేసే అధికారం తమకు లేదని ట్రిబ్యునల్ చైర్మన్ తేల్చిచెప్పారు. దీంతో ప్రస్తుతం తెలంగాణకు న్యాయమైన నీటి వాటా పొందడానికి అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ఒక్కటే దిక్కుగా మారింది. కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడమో, ప్రస్తుత ట్రిబ్యునల్కే నీటి వాటాల పంపిణీ అధికారం ఇవ్వటమో తప్ప మరేవిధంగా తెలంగాణకు న్యాయం దక్కదని తేలిపోయింది.