వేగంగా సచివాలయ నిర్మాణం
సిబ్బందికి మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సదరు వర్క్ ఏజెన్సీని, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు 200 సంవత్సరాలు పటిష్టంగా ఉండేలా, భూకంపాలను సైతం తట్టుకునేలా నాణ్యతతో పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఐఐటీ నిపుణుల సూచనల ప్రకారం స్ట్రక్చర్ ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం ఆయన నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు. సచివాలయ భవనం ముందు భాగంలో 3 ఫ్లోర్లు, వెనకవైపు 4 ఫ్లోర్ల స్లాబ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. పనులు పకడ్బందీగా జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం ఆయన సెక్రటేరియట్ నిర్మాణ ఏజెన్సీ నిర్వహించిన ‘విశ్వకర్మ పూజ’లో పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డి వెంట ఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ, స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శశిధర్, షాపూర్జీ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.