Telangana | హైదరాబాద్ : తెలంగాణలోని నిరుపేద మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. 100 శాతం సబ్సిడీతో ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొదటి దశలో భాగంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 19వ తేదీన 10 వేల మంది మైనార్టీలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం.
ఈ క్రమంలో రెండో దశ ప్రారంభానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెండో దశకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 153 కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సాయం పంపిణీనికి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మైనార్టీలకు రెండో దశ ఆర్థిక సాయం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 120 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తున్నారు. తొలి దశలో 10 వేల మంది లక్ష రూపాయాల చొప్పున రూ. 100 కోట్లు పంపిణీ చేశారు.