హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఒక క్రిమినల్ కేసును కొట్టివేయాలని ఒకసారి పిటిషన్ వేసిన తరువాత ఆ కేసుకు సంబంధించిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండానే మళ్లీ అదే కారణాల మీద రెండో పిటిషన్ వేయడం చెల్లదని హైకోర్టు స్పష్టంచేసింది. ఒకే కేసుకు సంబంధించి రెండో పిటిషన్ దాఖలు చేసినప్పుడు పరిస్థితుల్లో మార్పు చూపాలని, ఎలాంటి మార్పు లేకుండా రెండో పిటిషన్ను అనుమతించలేమని తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ పిటిషన్ను అనుమతిస్తే అది న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ కోర్టులో ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ గంగుల సైదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జే శ్రీనివాసరావు ఇటీవల విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది పానుగంటి విజయ్కుమార్ వాదనలు వినిపిస్తూ 2024లో కేసును కొట్టివేయాలని పిటిషన్ వేసినప్పటికీ అప్పట్లో కేసు వాదించిన న్యాయవాది కింది కోర్టులో హాజరు మినహాయింపు మాత్రమే కోరారని తెలిపారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్రావు వీరమల్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒకసారి పిటిషన్పై విచారణ పూర్తయ్యాక తిరిగి పిటిషన్ వేయడానికి చట్టం అనుమతించదని పేరొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి మొదట పిటిషన్ దాఖలు చేసినప్పటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని అన్నారు. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేనందున పిటిషన్పై విచారణ చేపట్టలేమంటూ పిటిషన్ను కొట్టివేశారు.